'బాబుకు కర్ణాటక గురించి మాట్లాడే హక్కు ఉందా, ఎన్టీఆర్ టు వాజపేయి... ఇదీ చరిత్ర'
అమరావతి: కర్ణాటకలోని వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అసలు మాట్లాడే హక్కు ఎక్కడిది అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గురువారం ప్రశ్నించారు. 1994లో ప్రజలు ఎన్టీఆర్కు పట్టం కడితే, నాడు పార్టీని, ప్రభుత్వాన్ని చీల్చిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అలాంటి వ్యక్తికి కర్ణాటకపై మాట్లాడే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు.
కొడుకు కోసం రంగంలోకి దేవేగౌడ: కేసీఆర్-చంద్రబాబు-మమతలకు ఫోన్
కర్ణాటక గవర్నర్ చాలా సీనియర్ అని, ఆయనకు రాజ్యాంగపరంగా కొన్ని ఆలోచనలు ఉంటాయని, దాని ప్రకారం ముందుకు నడుస్తారని వెల్లడించారు. చంద్రబాబు తీరును పరిశీలిస్తే 1996లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన వాజపేయి నేతృత్వంలోని బీజేపీకి మద్దతివ్వలేదన్నారు. మెజార్టీకి ఒకటి రెండు సీట్లు మాత్రమే తక్కువ వస్తే వాజపేయిని పడగొట్టారన్నారు.
చక్రం తిప్పింది అక్కడే
ఎన్టీఆర్ను పడగొట్టిన చంద్రబాబు, వాజపేయిని కూడా పడగొట్టారని సోము వీర్రాజు అన్నారు. తాను కేంద్రంలో చక్రం తిప్పానని చంద్రబాబు పదేపదే చెబుతున్నారని, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీతో అంటకాగి చక్రం తిప్పారన్నారు.
ఇదిగో చంద్రబాబుది కాంగ్రెస్ రక్తం!
ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబును గౌరవిస్తే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన అదే రక్తంతో 1996లో వ్యవహరించారన్నారు. ఇప్పుడు కూడా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మాట్లాడుతారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పైన చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుది అని మండిపడ్డారు. చంద్రబాబుది కాంగ్రెస్ రక్తం అన్నారు.
35వేల ఓట్లతో తెలుగువాళ్లు గెలిపించారు
ఏపీ ఎన్జీవో నేత కర్ణాటకలో తమకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని సోము వీర్రాజు తప్పుబట్టారు. చంద్రబాబు కూడా తమకు వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పారని విమర్శించారు. బీజేపీ నేతలను ఓడించేందుకు ఏపీ ఎన్జీవో నేతను కర్ణాటకకను పంపించిన ఘనత చంద్రబాబుది అన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓటు శాతం 19 నుంచి 35కు పెరిగిందన్నారు. తెలుగువాళ్లు ఉన్న పద్మనాభ నగర్లో బీజేపీని 35వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా పిలుపునిచ్చారు
ఎన్నికల సమయంలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పిలుపునిచ్చారని సోము వీర్రాజు అన్నారు. చంద్రబాబు పరిపాలన పైన కాకుండా మోడీని తిట్టడంపై దృష్టి సారించారన్నారు. రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చనిపోయిన వారికి పరిహారం ప్రకటిస్తే సరిపోతుందా అన్నారు.