పవన్ను అడుగుతా, బాకీ ఎంతో చంద్రబాబే చెప్పాలి: సోము వీర్రాజు
Recommended Video
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి ధ్వజమెత్తారు. చంద్రబాబుపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసిందని ఆయన శనివారం తెల్చేశారు. చెప్పనవన్నీ చేసిన పార్టీ తమ బిజెపి మాత్రమేనని ఆయన అన్నారు. చంద్రబాబుపై ప్రశ్నలు కూడా కురపిచారు.
ఆ విషయం పవన్నే అడుగుతా
తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికను ఏ మేరకు అమమలు చేసిందో తాను జనసేన చీఫ్ పవన్ కల్యాణ్నే అడుగుతానని సోము వీర్రాజ్ అన్నారు. ఎవరో కొన్ని సంఘాలు పెట్టినంత మాత్రాన తమకేమీ నష్టం లేదని అన్నారు. పవన్ కల్యాణ్ జెఎఫ్ని ఉద్దేశించి ఆయన ఆ వ్యాఖ్య చేశారు.
మిత్రపక్షంగా ఉంటూనే బురద
మిత్రపక్షంగా ఉంటూనే తెలుగుదేశం పార్టీపై తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని సోము వీర్రాజు అన్నారు. టిడిపితో పొత్తు వద్దని తాము ఎక్కడా అనలేదని గుర్తు చేశారు. రాజీనామాల అంశం వైసిపి, తెలుగుదేశం ఆడుతున్న డ్రామాలని ఆయన వ్యాఖ్యానించారు.
అన్ని రాయితీలు ఇచ్చాం...
రాష్ట్రంలోని ఏడు వెనుకడి జిల్లాలకు కేంద్రం 30 శాతం రాయితీ ఇచ్చిందని సోము వీర్రరాజు గుర్తు చేస్తూ ఆ జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని అడిగారు. తాము ఇచ్చిన రాయితీలతో చంద్రబాబు ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారని అడిగారు. తమ పార్టీ ఎదుగుతుందనే భయంతోనే టిడిపి తమపై బురద చల్లుతోందని ఆయన అన్నారు.
చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలి
కేంద్రం ఇచ్చిన రాయితీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసిందే చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలని, శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ఏం బాకీ ఉందో కూడా చంద్రబాబు చెప్పాలని ఆయన అడిగారు.
నిధులు సాధించడంలో నెంబర్ వన్ అని
నిధులు సాధించడంలో తాను నెంబర్ వన్ అని చెబుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారని సోము వీర్రాజు అడిగారు. విభజన హామీలను అమల చేయడానికి 2022 వరకు గడువు ఉందని చెబుతూ నాలుగేళ్లలోనే ఉద్యమాలు తీసుకొస్తారా అని ప్రశ్నించారు.
మోడీని అప్రతిష్ట చేసేందుకేనా...
విదేశాలు తిరుగుతూ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్న కింది కులానికి చెందిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టను దెబ్బ తీయాలని, ఆయనపై రాళ్లు రువ్వాలని ప్రయత్నం చేస్తారా అని సోము వీర్రాజు చంద్రబాబును ప్రశ్నించారు. మోడీ ప్రజాదరణను దెబ్బ తీయాలని, మోడీ ప్రభను తగ్గించాలని చూస్తారా అని మండిపడ్డారు.
ఇలా లెక్కలు చెప్పారు..
రాష్ట్ర ప్రభుత్వానికి 2015-16, 2016-17, 2017- 2018 సంవత్సరాల్లో ఇవ్వాల్సినవన్నీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందని సోము వీర్రాజు అన్నారు. తాము 16 వేల కోట్లు అడుగుతున్నామని, కేంద్రం 12 వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చంద్రబాబు చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. రుణమాఫీని కూడా కలిపి ఆ మొత్తాన్ని ఇవ్వాలని అడుగుతోందని ఆయన అన్నారు.
ఫైనాన్స్ కమిషన్ ఇలా తేల్చింది..
రుణమాఫీని, సంక్షేమ పథకాలకు అయ్యే ఖర్చులను కలిపి 16 వేల కోట్లు ఇవ్వాలని చంద్రబాబు అడుగుతున్నారని, అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సింది 4,600 కోట్లు మాత్రమే ఉంటుందని ఫైనాన్స్ కమిషన్ చెప్పిందని, అందులో 4 వేల కోట్లు విడుదలయ్యాయని, కేవలం 600 కోట్ల కోసం ఇంత గొడవ చేస్తారని అని సోము విర్రాజు అన్నారు. యుపికే రుణాఫీ ఇవ్వడం లేదని అన్నారు.
ఏమైనా ప్రణాళిక ఉందా...
వెనుకబడిన జిల్లాలకు కేంద్రం 1050 కోట్ల రూపాయలు ఇచ్చిందని సోము చెబుతూ ఆ మొత్తాన్ని వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం, రాయలసీమ జిల్లాల్లో ఏ విధంగా ఖర్చు పెడుతారో రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉందా అని అడిగారు. ఆ విషయాన్ని అడిగే హక్కు కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు.