బీసీని సీఎం చేస్తాం .. చంద్రబాబుకు, జగన్ కు ఆ దమ్ముందా? వలసలపై కూడా సోము వీర్రాజు సంచలనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో తాజా రాజకీయ పరిణామాలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ద్వజమెత్తారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఆ దమ్ము ధైర్యం జగన్ కు,చంద్రబాబుకు ఉందా అని సవాల్ విసిరారు. ఒక పక్క పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతుంటే ఆసక్తికర వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెంచారు సోము వీర్రాజు.
రాష్ట్రంలో టిడిపి, వైసిపిలతో నష్టం జరుగుతుంది
ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన అధికార వైసిపికి, టీడీపీకి బీసీలను సీఎం చేసే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీలంతా బిజెపి లోనే ఉన్నారని పేర్కొన్న సోము వీర్రాజు అటు టీడీపీకి ఇటు వైసీపీని తూర్పారబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ద్వారా ఏపీ రూపురేఖలు పూర్తిగా మార్చాలని బిజెపి భావిస్తోందని పేర్కొన్న సోము వీర్రాజు రాష్ట్రంలో టిడిపి ,వైసిపి లతో నష్టం జరుగుతోందని మండిపడ్డారు.
పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయొద్దని బిజెపి నేతలను బెదిరిస్తున్నారని ఆరోపణలు గుప్పించిన సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలో బీజేపీలోకి భారీగా వలసలు..
రాష్ట్రంలో బీజేపీ లో చేరడానికి చాలామంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారని, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు బీజేపీలో చేరడానికి రెడీ అవుతున్నారని పేర్కొన్నారు సోము వీర్రాజు. బీజేపీలోకి త్వరలో వలసల జోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మాజీ మంత్రులు ,మాజీ ఎమ్మెల్యేలతో పాటు టిడిపి, వైసిపికి చెందిన చాలామంది నేతలు త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తమ పార్టీతో వారంతా చర్చిస్తున్నారని పేర్కొన్నారు సోము వీర్రాజు. భద్రాచలం తెలంగాణ రాష్ట్రానికి వెళ్లడం వల్ల రాయలసీమకు 200 టీఎంసీల నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.
అచ్చెన్నాయుడిపై ఆగ్రహం, జనసేన పొత్తు కొనసాగుతుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇదే సమయం లో అచ్చెన్నాయుడు పై మండిపడ్డారు . హోంమంత్రి అంటే చంద్రబాబు ఇంటికి కాదని అచ్చెన్నాయుడు తెలుసుకోవాలని సూచించారు సోము వీర్రాజు. బీసీ అయిన ఒక ప్రధానమంత్రి వెనుక బిజెపి నడుస్తోందని, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒక బీసీని ముఖ్యమంత్రిని చేయగలరా అంటూ, ఆ సత్తా ఉందా అంటూ ప్రశ్నించారు సోము వీర్రాజు. ఇక బీజేపీ, జనసేన పొత్తు పంచాయతీ ఎన్నికల్లో మాత్రమే కాదు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని పేర్కొన్నారు.
బీసీలను ఆకట్టుకునే పనిలో బీజేపీ .. వైసీపీకి తామే ప్రత్యామ్నాయమని ప్రకటన
సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీసీని సీఎం చేస్తామని ప్రకటన చేసి బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బిజెపి నాయకులు. తాజాగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా కాపుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే .