టిడిపి-బిజెపి పొత్తు నా మూలంగా తెగదు;బిజెపిని అల్లరి చెయ్యాలనే: సోము వీర్రాజు
Recommended Video
టిడిపి పై బిజెపి నేత సోము వీర్రాజు ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి టీడీపీ గురించి, బీజేపీతో ఆ పార్టీ పొత్తు గురించి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. టిడిపి-బిజెపి పొత్తు తన మూలంగా తెగదని ఈ సందర్భంగా సోము వీర్రాజు చెప్పారు.
అయితే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి, నరేంద్రమోదీకి ప్రజాభిమానం లేకుండా చేయాలని టీడీపీ నేతలు చూస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. అలాగే ప్రతి విషయానికి మిత్ర ధర్మం అంటగట్టడం సబబు కాదని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. అయినా బీజేపీ మిత్ర ధర్మంతోనే వ్యవహరిస్తోందని, టీడీపీ-బీజేపీ పొత్తు తన మూలంగా తెగదని అన్నారు.
బీజేపీని అల్లరి పెట్టాలనే పార్లమెంట్ దగ్గర టీడీపీ ధర్నాలు చేస్తోందని, బీజేపీని అన్ని వైపుల నుంచి ముట్టడిస్తూ విమర్శలు చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. అంతేకాకుండా నిజాలు చెప్పిన వ్యక్తిని శత్రువుగా, అవినీతిపరుడిగా టీడీపీ చూస్తోందని విమర్శించారు.రాజకీయాల్లో ముఖ్యంగా కావాల్సింది 'కరప్షన్' కాదని 'కమిట్ మెంట్' అని...దాన్నే తాము ఆదర్శంగా తీసుకుని జీవిస్తున్నామన్నారు.
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారని, మరి...రాష్ట్ర బడ్జెట్ లో అన్ని జిల్లాలకు న్యాయం చేస్తున్నారా?...అని సోము వీర్రాజు టిడిపి నేతలను ఉద్దేశించి ప్రశ్నించడం కలకలం రేపుతోంది.