'నిజాలు తెలుస్తున్నాయనే ఒత్తిడిలో.. కన్నాపై దాడి వెనుక బాబు, పవన్పైనా'
Recommended Video
రాజమండ్రి: చంద్రబాబు నాయుడు సంస్కృతికి ఈ దాడి నిదర్శనమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. చెప్పులు విసిరే సంస్కృతి ఏ విధంగా ఆదర్శం అవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు బీజేపీ బెదరదని చెప్పారు. మేం అధికారంలో ఉన్నా లేకున్నా వాస్తవాలు ప్రజలకు చెబుతామని, బాబు ప్రభుత్వంపై పోరాడుతామన్నారు. బాబు కుటిలనీతిని అడ్డుకుంటామన్నారు.
కన్నాపై చెప్పులదాడిపై వీర్రాజు సీరియస్ అయ్యారు. దాడి వెనుక కచ్చితంగా చంద్రబాబు ఉన్నారని భావిస్తున్నామని చెప్పారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. బీజేపీ నేతలపై తిరగబడాలని చంద్రబాబే ప్రకటించారని, అందుకే ఆ పార్టీ వారే చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు కొరివితో తల కొరుక్కుంటున్నారన్నారు.
ఈ దాడులపై గవర్నర్ను మూడుసార్లు కలిశాం
రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా వైఫల్యం చెందాయని భావిస్తున్నామని చెప్పారు. రాజమండ్రిలో నా ఇంటికి రౌడీలను పంపించారని, కాకినాడలో తమ పార్టీ నేతపై దాడికి యత్నించారని, కన్నాపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అమిత్ షాపై రాళ్ల దాడి చేశారని, కన్నాపై దాడి చేశారని, దీనిపై గవర్నర్ను మూడుసార్లు కలిశామన్నారు. హోంమంత్రిని, డీజీపీని కూడా కలిశామన్నారు. ఇక ఈ దాడులపై మేం ఏం చేయాలన్నారు.
నిజాలు తెలుస్తాయని భయంతో దాడులు
మేం వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నామని, అవి ప్రజలకు తెలిస్తే తనకు నష్టం జరుగుతుందని చంద్రబాబు భయపడుతున్నారని, అందుకే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కానీ వారి తాటాకు చప్పుళ్లకు తాము భయపడేది లేదన్నారు. తమకు టీడీపీని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. వారే తమను టార్గెట్ చేస్తున్నారన్నారు. అధర్మ పాలకుడు చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేస్తున్నారన్నారు.
ఆ తిరగబడిన వారు ఎవరో తెలియాలి
బీజేపీ చేసిన అన్యాయానికి తిరగబడుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారని, మరి ఆ తిరగబడుతున్న వారు ఎవరో తెలియాలి కదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. బీజేపీ అంటేనే చంద్రబాబుకు భయమన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో చంద్రబాబు మీటింగ్ పెట్టి అదే కేంద్రాన్ని తిడతారని ఎద్దేవా చేశారు. కన్నాపై దాడి జరిగితే బీజేపీ వారు ప్రతిఘటించారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. శాంతిభద్రతలు కాపాడాలని గవర్నర్కు ఫిర్యాదు చేశామన్నారు.
మాపై దాడులు జరిగినా వెనుదిరగం
దాడులు చంద్రబాబు దుర్నీతి అని సోము వీర్రాజు మండిపడ్డారు. మా పార్టీ అధ్యక్షులు కన్నా తాము చేసిన పనులు చెబుతున్నారని, దానిని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మమ్మల్ని నక్సలైట్లు చంపారని రాజకీయాల్లో ఉన్నామని, కేరళలో సీపీఎం కార్యకర్తలు దాడులు చేస్తున్నారు.. అయినా రాజకీయాల్లో ఉన్నామని, ఇక్కడా దాడులు జరిగినా ఉంటామన్నారు. వాస్తవాలు ప్రజలకు చెబుతామన్నారు. చంద్రబాబు తమపై దాడులు చేయిస్తున్నారని, పవన్ కళ్యాణ్ యాత్రలను కూడా అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.