బీజేపీ సారధిగా రేపు బాధ్యతలు చేపట్టనున్న సోము: ఓన్లీ వర్చువల్: ఇంకెన్ని సస్పెన్షన్లు ఉంటాయో?
అమరావతి: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలను అందుకోవడానికి ముహూర్తం కుదిరింది. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించబోతున్నారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వాజ్పేయి భవన్లో ఆయన బాధ్యతలను చేపడతారు. ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనీ వదల్లేదు: పాజిటివ్ రిపోర్ట్: కరోనా బారిన హైప్రొఫైల్
వర్చువల్ విధానంలో లైవ్..
సోము వీర్రాజు బాధ్యతలను స్వీకరించే కార్యక్రమాన్ని పార్టీకి చెందిన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫాంల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదవుతుండటం, చాలా ప్రాంతాల్లో పాక్షికంగా లాక్డౌన్ కొనసాగుతోండటం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సోము వీర్రాజు అధ్యక్ష బాధ్యతలను చేపట్టే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తామని పేర్కొన్నాయి.
ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా..
పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించాలని పార్టీ నాయకులు సూచించారు. బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆయన పార్టీ స్థితిగతులపై అధికారికంగా తొలి సమీక్షా సమావేశాన్ని నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. నిజానికి- బీజేపీలో సోము వీర్రాజు మీద ఫైర్బ్రాండ్ ఇమేజ్ ఉంది. దానికి అనుగుణంగానే ఆయన చర్యలూ ఉంటున్నాయి.
వివాదాంశాలపై ముక్కుసూటిగా..
రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదంగా మారిన మూడు రాజధానుల ఏర్పాటు, అమరావతి అంశంపై ఇప్పటికే పార్టీ విధానం ఏమిటో ఆయన ముక్కుసూటిగా వెల్లడించారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్ష పదవికి తన పేరును ప్రకటించినప్పటి నుంచే ఆయన మూడు రాజధానులపై తన వైఖరిని స్పష్టం చేశారు. కేంద్రం కూడా జోక్యం చేసుకోబోదనీ కుండబద్దలు కొట్టారు. దేశ రాజధాని సాక్షిగా ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
లైన్ తప్పితే.. వేటుకు వెనుకాడట్లేదు..
అక్కడితో ఆగలేదాయన. అమరావతికి అనుకూలంగా గళం ఎత్తే నాయకులపైనా చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు. మొహమాటానికీ వెళ్లట్లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన లంకా దినకర్కు షోకాజ్ నోటీసులను జారీ చేయగలిగారు. కొద్దిరోజులకే పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా, అమరావతికి అనుకూలంగా ప్రకటనలను గుప్పించిన పార్టీ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యుడు ఓవీ రమణపై వేటు వేశారు.
రాజకీయంగా వ్యూహాత్మకంగా..
తాజాగా అమరావతి రైతులకు బాహటంగా మద్దతు తెలుపుతూ..అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటోన్న వెలగపూడి గోపాలకృష్ణనూ సస్పెండ్ చేశారు. ఆయా చర్యల వల్ల మున్ముందు తాను ఎలా వ్యవహరించబోయేదీ సోము వీర్రాజు చెప్పకనే చెప్పినట్టయింది. రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించకముందే.. కాపు సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ను కలుసుకున్నారు.