చంద్రబాబు చేసిన పని ఇదీ: సోము వీర్రాజు సంచలన వ్యాఖ్య
నర్సీపట్నం: తెలుగుదేశం పార్టీతో తమ పార్టీ పొత్తుపై బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాకినాడ కార్పోరేషన్ ఫలితాల విషయయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తప్పు పట్టారు.
ఆంధ్రప్రదేశ్లో ఇతర పార్టీలతో పొత్తుల కారణంగా తమ పార్టీ తీవ్రంగా నష్టపోతోందని సోము వీర్రాజు అన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునే రాజకీయ పార్టీలు స్వతంత్రంగా ఎదగలేవని ఆయన అన్నారు.
టిడిపి చేసిన పని ఇదీ...
అటువంటి పార్టీల్లో కొత్తగా చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపరని శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి టీడీపీ తొమ్మిది స్థానాలిచ్చిందని, కానీ ఒకే స్థానంలో తమ అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితిని కల్పించిందని ఆయన అన్నారు.
చంద్రబాబుకు తెలిసే జరిగింది.
తమకు కేటాయించిన అనేక స్థానాల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో స్వతంత్రులు గెలిచారని, ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసే జరిగిందని ఆయన వ్యాఖ్యానిచారు. కావాలనే చంద్రబాబు బిజెపి అభ్యర్థులను ఓడించేందుకు సిద్ధపడ్డారని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
చంద్రబాబు తొందరపడి నిందలు
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాని మోడీ ప్రభుత్వం అనేక ప్రయోజనకర నిర్ణయాలు తీసుకుంటోందని, అయితే చంద్రబాబు కొన్ని సందర్భాల్లో తొందరపడి కేంద్రంపై నింద మోపుతున్నారని అన్నారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పోలవరంపై దృష్టి పెట్టలేదని అన్నారు.
బిజెపిలో ఓ వర్గం అసంతృప్తి
తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగించడం పట్ల ఆంధ్రప్రదేశ్ బిజెపిలోని ఓ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సోము వీర్రాజు వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సినవారు దగ్గుబాటి పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావు, కన్నా లక్ష్మినారాయణ.