చంద్రబాబు అవినీతిపై కేసులు వేస్తే...విచారణకు కోర్టులకు టైమ్ చాలదు:సోము వీర్రాజు
కాకినాడ:ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతిలో కురుకుపోయారని ఆయనపై కేసులు వేస్తే విచారణకు కోర్టులకు టైమ్ చాలదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
బుధవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయం చేసేసిందని సోము వీర్రాజు ఆరోపించారు. అమృత పథకంలో ఆంధ్రప్రదేశ్ కు అవార్డు రావడానికి కేంద్రం ఇచ్చినా నిధులే కారణమని ఆయన వెల్లడించారు.
కేంద్రం ఇచ్చిన నిధులతోని అవార్డులు వస్తుంటే...ఆ అవార్డులను తీసుకుంటూనే...మరోవైపు నిధులు ఇవ్వడం లేదంటూ కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని సోము వీర్రాజు మండిపడ్డారు. వాస్తవానికి ప్రకృతి వ్యవసాయాన్ని సుభాష్ పాలేకర్ కనిపెట్టారని...ఈ విషయం అందరికీ తెలుసని సోము వీర్రాజు గుర్తుచేశారు.
అలాంటిది ఐకరాజ్య సమితిలో ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించేందుకు పాలెకర్ ను ఆహ్వానించకుండా...చంద్రబాబును ఆహ్వానించారని అంటున్నారని...మరి పాలేకర్ కన్నా చంద్రబాబు ముందు పుట్టారా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రకృతి వనరులు దారుణంగా దోచుకుంటున్న చంద్రబాబు ఏ విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారో అర్ధం కావడం లేదని సోము వీర్రాజు అన్నారు.
మరోవైపు టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ బీజేపీ నాయకులు తప్పుడు కూతలు కూస్తున్నారంటూ మండిపడ్డారు. జీవీఎల్, బీజేపీ నేతలతో ఏ అంశంపైనైనా చర్చలకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. అమరావతి బాండ్ల అమ్మకాల్లో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బాండ్లు అమ్ముకోలేదా?...అని ఆయన ప్రశ్నించారు. రామయాపట్నం, దుగరాజపట్నం పోర్టుల విషయంలో...రాఫెల్ డీల్ విషయంలో బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని బోండా ఉమా నిలదీశారు.