ఏపి హోదాపై గోబెల్స్ ప్రచారం: సోము వీర్రాజు, సుధీష్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విపక్షాలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, అధికార ప్రతినిధి సుధీష్ రాంభోట్ల ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం ప్రకటించకపోయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, వామపక్షాలతోపాటు టిడిపిలోని కొంతమంది నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
పార్టీ నేతలు సురేష్ రెడ్డి, కపిలేశ్వరయ్య, సుధీష్ రాంభోట్ల తదితరులతో కలిసి సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ‘ఏపీకి టోపీ, చేయూత ఇస్తామన్న పార్టీ చేయిచ్చేసింది' అంటూ బిజెపికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం జరుగుతున్నదన్నారు. విభజన సమయంలో ఏపీకి ఏమి కావాలో చెప్పని పార్టీలు ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడం అన్యాయమన్నారు.
టిడిపితోపాటు కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కూడా ఏపీకి ఇవి కావాలని కేంద్రాన్ని కోరలేదన్నారు. ప్రత్యేక హోదా ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రాయలసీమ, ఉత్తరాంధ్రల అభివృద్ధికి రూ.350 కోట్లు విడుదల చేశామని, పరిశ్రమలకు కొన్ని రాయితీలు ఇచ్చామని, రెవెన్యూ లోటు భర్తీకి రూ.2 వేల కోట్లు, రాజధానికి రూ.2500 కోట్లు... మొత్తం రూ.8 వేల కోట్లు ఇచ్చినట్టు తెలిపారు.
కేంద్రం సహకారంతోనే ఏపీ జీడీపీ కేంద్రం కంటే ఎక్కువ నమోదైందని ప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే సోపానం కాదన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు కూడా బిజెపి తీరును తప్పుపడుతున్నారన్న విషయాన్ని ప్రస్తావించగా.. దీనిపై చంద్రబాబు స్పందిస్తేనే తాము మాట్లాడతామన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు వచ్చిన తరవాత ప్రత్యేక హోదా వల్ల పెద్ద ప్రయోజనం ఏమీలేదని చంద్రబాబు ప్రకటించారని సుధీష్ రాంభోట్ల తెలిపారు.