మోడీ లేకుంటే చంద్రబాబు జీరో: రక్తం మరిగిన పులి అంటూ సోము తీవ్ర వ్యాఖ్యలు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సచివాలయంలో నాయీ బ్రాహ్మణుల పట్ల సీఎం వీధిరౌడీలా ప్రవర్తించారని విమర్శించారు.
చంద్రబాబు వ్యాఖ్యలను బీజేపీ త్రీవంగా ఖండిస్తుందని తెలిపారు. నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాయీబ్రాహ్మణుల పట్ల సీఎం ప్రవర్తించిన తీరుకు రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు.
పేదల రక్తమరిగిన పులి..
అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై అడ్డగోలుగా నోరు పారేసుకున్నారని, పేదవాడి రక్తానికి మరిగిన పులి చంద్రబాబు నాయుడు అని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. క్షురకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధర్మంగా లక్షల కోట్ల అవినీతి చేస్తూ.. ధర్మ పోరాటాలు చేస్తున్నారని విమర్శించారు. బరితెగించి ఇసుక అమ్ముతున్నారని, ఇది దొంగల ప్రభుత్వమని వీర్రాజు ఆరోపించారు.
Recommended Video
మోడీ లేకుంటే బాబు జీరో
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేకపోతే ఏపీలో చంద్రబాబు నాయుడు జీరో అని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. ఏపీకి కేంద్రం చాలా సాయం చేసిందని తెలిపారు. ఈ విషయంలో చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు.
బాబు 600 హామీలపై
విధానపరమైన నిర్ణయాల వల్లే కాశ్మీర్లో పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చిందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి టీడీపీయే బయటకు వచ్చిందని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీలపై మండల స్థాయిలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు.
బాబుకు అమరావతి తప్ప..
కడప ఉక్కు పరిశ్రమ కేంద్ర ఇస్తామని చెప్పినా.. రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వలేదని సోము వీర్రాజు మండిపడ్డారు. చంద్రబాబుకు అమరావతి తప్ప ఉత్తరాంధ్ర, రాయలసీమలు కనిపించడం లేదని అన్నారు. నిరుద్యోగ భృతి ఎంతిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.