కూతురుపై చేయిచేసుకున్నాడని...అల్లుడి ముఖంపై యాసిడ్ పోసిన అత్త
విజయవాడ:కట్టుకున్న భార్యని పోషించక పోగా అదేమని అడిగితే చేయి చేసుకున్నాడంటూ కూతురి కాపురం విషయంలో అల్లుడి నిర్వాకంపై ఓ అత్త ఆగ్రహంతో రగిలిపోయింది.
దీంతో అల్లుడిపై కక్ష్య పెంచుకున్న ఆమె ఏకంగా అతడిపై యాసిడ్ తో దాడి చేసింది. అత్త దాడితో తీవ్రంగా గాయపడిన ఆ అల్లుడు ఇప్పుడు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. విజయవాడ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది. అత్తపై అల్లుడి దాడి గురించి విన్నాం కానీ అల్లుడిపై ఓ అత్త ఏకంగా యాసిడ్ దాడి చేయడం ఆశ్చర్యం కలిగించిందంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే...
విజయవాడ నగర శివారులోని వాంబే కాలనీకి చెందిన మోహనాచారి అనే వ్యక్తికి పదేళ్ల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన మహిళతో పెళ్లి అయింది. అయితే పెళ్లి అయిన నాటి నుంచి మోహనాచారి పనీపాటా లేకుండా తిరుగుతూ ఇబ్బంది పెడుతున్నాడని కుమార్తె తల్లితో చెప్పి వాపోయేది. ఈ క్రమంలో ఇటీవల మోహనాచారి ఇంటి ఖర్చుల కోసం కూడా భార్యకు డబ్బులు ఇవ్వకపోగా ఆమె అదేమని అడిగిన క్రమంలో వారిద్దరి మధ్యా తీవ్ర మనస్పర్థలు తలెత్తాయి.
ఈ క్రమంలో తనపై మోహనాచారి చేయిచేసుకున్నట్లుగా ఆమె కుమార్తె తన తల్లికి తెలిపింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన అత్త ఎక్కడినుంచి సంపాదించిందో గానీ ఏకంగా అల్లుడి ముఖంపైనే యాసిడ్ పోసింది. దీంతో తీవ్రంగా గాయపడిన అల్లుడు మోహనాచారిని పాయికాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స నందిస్తున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.