మారమని చెప్పినందుకే!: మృగంలా.. రెచ్చిపోయిన ఇల్లరికం అల్లుడు, మామ మృతి
కడప: పిల్లనిచ్చిన మామనే హత్య చేశాడో ప్రబుద్దుడు. గాడి తప్పిన అతనికి మంచిగా నడుచుకోవాలని చెప్పడమే ఆ వ్యక్తికి శాపమైంది. భోజనం చేస్తుండగా తలపై నరికి దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన అత్తపై కూడా దాడికి పాల్పడ్డాడు.
కడప జిల్లా చిట్వేలిలో ఈ దారుణం చోటు చేసుకుంది. శంకరయ్య(38) అనే ఇల్లరికం అల్లుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
ఎవరీ శంకరయ్య:
బులవారిపల్లె మండలం కాకర్లవారిపల్లెకు చెందిన శంకరయ్యకు సి.కందువారిపల్లెకు చెందిన కాకర్ల రామకృష్ణయ్య (60), నారాయణమ్మ(50) దంపతుల మూడవ కుమార్తె లలితతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి చరణ్ తేజ, వీరేష్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి అయినప్పటి నుంచి భార్యతో కలిసి శంకరయ్య అత్తగారింట్లోనే ఉంటున్నాడు.
ఆ గొడవతో:
నాలుగేళ్ల కిందట తన కాపురాన్ని అత్తగారింటి నుంచి చిట్వేలికి మార్చాడు శంకరయ్య. అక్కడ ఫైనాన్స్ వ్యాపారం మొదలుపెట్టి దెబ్బతిన్నాడు. ఆ తర్వాత చిట్వేలిలోనే బియ్యం విక్రయ వ్యాపార మొదలుపెట్టాడు. ఇటీవల అతని ఎదురు షాపులో ఉండే వ్యక్తితో శంకరయ్యకు విభేదాలు వచ్చాయి. అప్పటినుంచి అతని మానసిక ప్రవర్తనలో మార్పులు వచ్చినట్లు చెబుతున్నారు. ఎవరు పలకరించినా.. ఆవేశంగా బదులిచ్చేవాడని స్థానికులు చెబుతున్నారు.
రెండో అల్లుడు రవిని పిలిపించి:
పెద్దల్లుడు శంకరయ్య ప్రవర్తనతో ఆందోళన చెందిన అతని మామ రామకృష్ణయ్య రెండో అల్లుడి ద్వారా అతనికి నచ్చజెప్పించాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే రవిని ఇంటికి పిలిచాడు. భోజనాల సమయంలో అంతా కూర్చొని భోజనం చేస్తుండగా.. అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో మధ్యలోనే లేచి గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకున్నాడు శంకరయ్య.
భోజనం చేస్తుండగా దాడి:
గదిలోకి వెళ్లిన శంకరయ్యను బయటకు రావాలని ఎంత పిలిచినా వినిపించుకోలేదు. చివరకు రాత్రి 10గం. సమయంలో బయటకు వచ్చి నీళ్లు తాగి హాల్లోని మంచంపై పడుకున్నాడు. ఆ సమయంలో అత్త మామలు భోజనం చేస్తుండగా.. ఇంట్లో నుంచి గొడ్డలి తీసుకొచ్చి మామ తలపై దాడి చేశాడు. అడ్డుకున్న అత్త భుజంపై కూడా దాడి చేశాడు. అత్త గట్టిగా కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పారిపోయాడు.
మామ మృతి:
శంకరయ్య దాడిలో తవ్రంగా గాయపడిన రామకృష్ణయ్యను చిట్వేలి పీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుమాకు తరలించారు. చికిత్స పొందుతూ రామకృష్ణయ్య మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో అత్త అత్త నారాయణమ్మ మంగళవారం ఉదయం 9 గంటలకు చిట్వేలి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.