కన్నకొడుకే కాలయముడు:తల్లిదండ్రుల దారుణ హత్య...ఇద్దరూ కూర్చున్న చోటే హతం
గుంటూరు:ఆస్తుల ముందు అనుబంధాలు తీసికట్టుగా మారాయి. కాసుల కోసం కన్నవాళ్లని కూడా చూడకుండా కిరాతకంగా హతమార్చే రోజులు దాపురించాయి. గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న తాజా ఉదంతం ఇలాంటి దారుణాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
తల్లిదండ్రులకు అతడు ఒక్కడే కొడుకు...తాను అప్పు చేసి ఇల్లు కొన్నాడు...ఆ అప్పు తీర్చేందుకు తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిని అమ్మేయడమే పరిష్కారమని అతడు భావించాడు. అందుకు వారు అంగీకరించకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆ కుమారుడు వారిద్దరిని ఉన్నపళాన ఉన్న చోటే శవాలుగా మార్చేశాడు. గుంటూరు నగరానికి సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘోరం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే...
మోర్జంపాడు గ్రామానికి చెందిన దుగ్గు పుల్లారెడ్డి (65), పూర్ణమ్మ (60) దంపతులకు కొడుకు నరసింహారెడ్డి, కుమార్తె ఉన్నారు. నరసింహారెడ్డి ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఆర్ఎంపీగా పనిచేస్తూ, అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడు తాను ఉంటున్న ప్రాంతంలోనే రూ. 8 లక్షలు పెట్టి ఇటీవలే ఓ ఇల్లు కొనుగోలు చేశాడు. ఇందుకోసం అతడు కొంత అప్పు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ అప్పును తీర్చాలన్నా, తాను పెట్టిన ఖర్చును తిరిగి రాబట్టాలన్నా ప్రస్తుతం తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిని అమ్మేయడమే పరిష్కారమని అతడు నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో తల్లిదండ్రులను ఇల్లు అమ్మేసి తన దగ్గర వచ్చి ఉండమని నరసింహారెడ్డి వారితో అన్నాడు. అయితే అందుకు వాళ్లు ఇల్లు అమ్మేసి, ఊరు వదిలేసి రావడానికి సుముఖంగా లేకపోవడంతో ఇదే విషయమై మోర్జంపాడుకు వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులతో వాగ్వాదం జరిగేది. ఈ క్రమంలోనే నరసింహారెడ్డి బుధవారం రాత్రి మోర్జంపాడులో బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చాడు. ఆ రాత్రి అంతా బాగా మద్యపానం సేవించిన నరసింహారెడ్డి గురువారం ఉదయం తల్లిదండ్రులతో మరోసారి ఇంటి విషయమై ఘర్షణ పడ్డాడు.
అయితే కొడుకుతో గొడవ ఎప్పుడూ ఉండేదే కదా అనే చందంలో తండ్రి పుల్లారెడ్డి కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తుండగా, తల్లి పూర్ణమ్మ అక్కడికి కొద్దిదూరంలో చేటలోని బియ్యంలో రాళ్లు యేరుతోంది. ఘర్షణ నేపథ్యంలో విచక్షణ కోల్పోయిన కొడుకు నరసింహారెడ్డి చేతికి అందిన బలమైన ఆయుధంతో ముందుగా కుర్చీలోని తండ్రి తలపై బాదడంతో ఆయన కుర్చీలో కూర్చున్న చోటే తల ముందుకు వేలాడేశాడు.
అంతలో తల్లి పూర్ణమ్మ తేరుకొని చూసేలోపే ఆమె మాడుపై కొట్టడంతో ఆమె కూడా తాను కూర్చొన్నచోటే కుప్పకూలిపోయింది. తీవ్ర రక్తస్రావంతో వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఆ తరువాత నరసింహారెడ్డి అక్కడనుంచి పారిపోగా అనుమానం వచ్చిన చుట్టుప్రక్కల వారు ఇంట్లోకి వచ్చి చూసి పోలీసులకు సమాచారం అందించడతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నరసింహారెడ్డి కోసం గాలిస్తున్నారు.