కొడుకులు కొట్టిన దెబ్బ.. కోలుకోలేక పోతున్న తండ్రులు..! ఏపీలో సన్ స్ట్రోకుల రాజకీయం..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపీలో విచిత్ర సంస్క్రుతి రాజకీయ నేతల పతనానికి శ్రీకారం చుట్టింది. రాజకీయ వారసుడిగా మంచి ఇమేజ్ వస్తుందని భావించిన తండ్రుల భవిత డ్యామేజ్ అయ్యింది. రాజకీయాల్లో కొడుకులను నమ్ముకుని ఎంతో మంది తండ్రులు మట్టికరిసారు. రాజకీయంగా తమకంటూ ఎంతో ప్రజాభిమానం తెచ్చుకున్న నేతలు, చివరకు వారసుల వల్ల పరాభవం చవిచూస్తున్నారు. ఏపీలో మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు చాలామంది ఓటమి చవిచూశారు. ఇరవై.. పాతికేళ్లపాటు రాజకీయంగా సంపాదించిన పలుకుబడి.. పేరు ప్రతిష్ఠలు ఇవేమీ వారిని గెలిపించలేకపోయాయి. ఇలా అనేకంటే కొడుకులు, కూతుళ్ల చేతికి పెత్తనం ఇస్తే.. ప్రజలు చూస్తూ ఉండలేక, ఓటమి రూపంలో మంచి బహుమతి ఇచ్చారని కూడా చెప్పొచ్చు.
ఏపీలో కొడుకుల ఇమేజ్..! తండ్రులకు చేసింది ఎంతో డ్యామేజ్..!
ఇప్పుడు ఏపీలో టీడీపీలోని సీనియర్ నేతలకు గుబులు మొదలైంది. ఈ వరుసలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. తాజాగా ఏపీ మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. తండ్రి పదవిని అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనయుడు శివరామకృష్ణ సాగించిన దారుణాలు ఒక్కొకటీ వెలుగు చూస్తున్నాయి. పలు కంపెనీల నుంచి నయానా.. భయానా సుమారు 70 కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. దీనంతటికీ కోడెల కారణమంటూ బలమైన ఆధారాలు కూడా బాధితుల నుంచి పోలీసులు స్వీకరించారట. సత్తెనపల్లిలో ఐదేళ్లపాటు కే ట్యాక్స్ పేరిట వసూళ్లకు తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుందంటూ వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
ఏపి వ్యాప్తంగా సన్ స్ట్రోకులే..! గిలగిలా కొట్టుకుంటున్న తండ్రులు..!!
బోండా ఉమా.. 50 ఓట్ల తేడాతో మల్లాది విష్ణు చేతిలో ఓటమి చవిచూశారు. బ్రాహ్మణులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఉమా చేసిన దారుణాలు ఎన్నికల్లో ప్రతిఫలించాయి. ఇద్దరు తనయులు రౌడీలుగా సాగించిన దారుణాలు కూడా బోండాకు గుదిబండగా మారాయనే చెప్పాలి. భూముల కబ్జా, ఆర్టీఏ అధికారుల బెదిరింపు, తనయులిద్దరూ బెజవాడలో చెలాయించిన పెత్తనం, అనధికార బైక్, కారు రేసులతో హల్ చల్. గుంటూరు శివార్లలో కారు పందేలు నిర్వహించి ఇద్దరు విద్యార్థుల మరణానికి కారణమయ్యారు. ప్రయివేటు వాహనాల్లో సైరన్లతో నానాయాగీ చేసిన పాపం.. తండ్రి రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్ధకంగా మార్చాయి. అనంతపురంలో జేసీ బ్రదర్స్ ఇద్దరి తనయులు ఘోరమైన ఓటమి చవిచూడాల్సి రావటానికి.. వారి ప్రవర్తనే కారణంగా చెప్పుకుంటున్నారు.
రాజకీయ వారసులుగా వచ్చారు..! ఉనికి లేకుండా చేసారు..!!
కర్నూలులో కేఈ కృష్ణమూర్తి తనయుడుదీ ఇదే పరిస్థితి. హత్యలు, సెటిల్మెంట్లు, దందాలతో జిల్లాలో అధికారాన్ని దుర్వినియోగం చేశారు. వైసీపీ నేత హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్నా అధికార బలంతో తప్పించుకున్నారు. పరిటాల రవి వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన పరిటాల శ్రీరామ్ ఓటమికి.. రవి అనుచరులను దూరం చేసుకోవటం.. కేవలం ఒక్క కులానికే ప్రాధాన్యతనివ్వటమే కారణాలు. అంతవరకూ అయితే పర్లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాగించిన రౌడీయిజంపై వైసీపీ నేతలు ఆందోళనలు చేసేంత వరకూ చేరారు.
రాజకీయాల్లో విచిత్ర సంప్రదాయం..! మారకపోతే సమాజానికి పెను ప్రమాదం..!!
విశాఖ, గోదావరి జిల్లాల్లోనూ ఇదే వరుస. ఐదేళ్లపాటు.. టీడీపీ సాగించిన దారుణాల వెనుక.. ప్రధానమైన నిందితులు.. ఎమ్మెల్యేలు, ఎంపీల వారసులే కావటం విశేషం. కొడుకులకు రాజకీయ వేదిక కల్పించాలనే ఉద్దేశంతో తండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను తనయులు దుర్వినియోగం చేసుకున్నారు. పైగా.. తండ్రుల రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్ధకంగా మార్చారు. మున్ముందు కూడా ఇదే వ్యతిరేకత ప్రజల్లో కొనసాగితే తండ్రులతోపాటు.. తనయులు కూడా రాజకీయాలకు దూరం కావాల్సిందనే విమర్శలూ లేకపోలేదు. అయితే.. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం తమపై నమోదుచేసే కేసులు.. దర్యాప్తులు.. కోర్టులు.. జైళ్ల నుంచి ఎలా బయటపడాలనేది వారికి పెను సవాల్ గా పరిణమించింది.