సోనియా ఒప్పించారు, మోడీ ఒప్పించాలి: ప్రత్యేక హోదాపై పల్లం రాజు
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తమ పార్టీ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులను ఒప్పించారని, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించడానికి ప్రధాని నరేంద్ర మోడీ చొరవ చూపాలని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత ఎంఎం పల్లరాజు అన్నారు.
జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసి)లో కాంగ్రెసు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను సోనియా గాంధీ ఒప్పించారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశానికి మద్దతు ఇవ్వాలని సోనియా కాంగ్రెసు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారని ఆయన చెప్పారు.
భారీ రెవెన్యూ లోటు కారణంగా, రాజధాని కూడా లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పొందే అర్హత ఉందని ఆయన అన్నారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం ప్రత్యేక హోదాకు ఆమోద ముద్ర వేసి, దాన్ని ప్రణాళికా సంఘానికి పంపించినట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి ప్రధాని నరేంద్ర మోడీ చొరవ ప్రదర్శించాలని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఎపికి కేంద్రం నుంచి 90 శాతం నిధులు వస్తాయని, రెవెన్యూ నష్టాలు భర్తీ అవుతాయని ఆయన చెప్పారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించేలా, పునర్విభజన చట్టంలోని హామీలు అమలయ్యేలా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూడాలని ఆయన సూచించారు. రాజకీయ ఆకాంక్ష ఉంటే అది నెరవేరుతుందని, ఎపికి ఎన్డీయే ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన కోరారు.