పేగుబంధం మరిచారు.. అమ్మనాన్నను గెంటేశారు.. రీజన్ ఎంత సిల్లీ అంటే..!
ప్రకాశం : అల్లారుముద్దుగా పెంచిన కన్నప్రేమ వృద్దాప్యంలో భారమైంది. భుజాలపై ఎత్తుకుని ఎంతసేపైనా అలసిపోకుండా ఆడించినా అమ్మనాన్నలు ఇప్పుడు పనికిరానివాళ్లయ్యారు. కని పెంచిన ప్రేమ ఆ కన్నకొడుకులకు లేకుండా పోయింది. తమకు జీవితం ప్రసాదించిన తల్లిదండ్రులను కాదు పొమ్మనడంతో చివరకు రోడ్డుమీద పడ్డారు.
టీబీ వ్యాధితో తండ్రి బాధపడుతున్నాడనే కారణంతో కొడుకులు దగ్గరకు రానివ్వని ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. అలాంటి మానవత్వం మంటగలిసిన హృదయవిదారక తీరు దోర్నాల మండలం అసనాబాద్లో జరిగింది.
భారంగా మారిన వృద్ధాప్యం
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం అసనాబాద్కు చెందిన మండల పాపయ్య - వెంకమ్మ దంపతులు. వీరికి ఆరుగురు సంతానం కాగా.. అందులో నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ పెళ్లిళ్లయి ఎవరికివారుగా స్థిరపడటంతో వృద్ధ దంపతులు మాచర్లలోని బత్తాయి తోటలకు కాపలాదారులుగా పనికి కుదిరారు. అలా జీవితం వెళ్లదీస్తున్న వీరి జీవితంలో అనుకోని కష్టాలు ఎదురయ్యాయి.
పాపయ్యకు టీబీ వ్యాధి సోకింది. ఎన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా రోగం నయం కాలేదు. అలా ఈ వృద్ధ దంపతుల జీవితంలో చీకట్లు అలముకున్నాయి. వ్యాధి మరింత ముదరడంతో తోట యజమాని పనికి రావొద్దన్నాడు. దాంతో చేసేదేమీ లేక సొంతూరుకు పయనమయ్యారు.
పోస్టింగుల ఊసు లేదు.. ఏపీలో 30 మంది డిఎస్పీలు బదిలీ.. ఇలా ఇదే తొలిసారా?
టీబీ వ్యాధి సోకిందని.. ఇంటి నుంచి గెంటేసిన కొడుకులు
ఉన్న కాసింత ఉపాధి కూడా కరువై బతుకు భారమైంది. ఆ క్రమంలో కొడుకుల వద్దకు చేరుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్లు ఆదరిస్తారని గంపెడాశలు పెట్టుకున్నారు. అలా అసనాబాద్లో ఉండే ఓ కొడుకు ఇంటికి వెళ్లారు. రెండు వారాలు అక్కడే ఉన్నారు. అయితే పాపయ్యకు టీబీ వ్యాధి సోకడంతో దగ్గు తీవ్రత ఎక్కువైంది. దాంతో వారి కోడలు ఈసడించుకోవడం మొదలుపెట్టింది.
వృద్ధ దంపతులు అని చూడకుండా ఆ కోడలు అనరాని మాటలు అంది. పాపయ్య చీటికిమాటికీ దగ్గుతున్నాడనే కారణంతో ఇంటి నుంచి వెళ్లిపోమని ఆర్డరేసింది. మీరు ఇక్కడే ఉంటే మాకు జబ్బు అంటుకుంటుందని సూటిపోటి మాటలతో వేధించింది. భార్య మాట జవదాటని ఆ సుపుత్రుడు ఏమీ అనలేకపోయాడు. దాంతో వారు బయటకు రావాల్సి వచ్చింది.
వారం రోజులుగా నరకయాతన.. చెట్టు కిందే జీవితం
మిగతా ముగ్గురు కొడుకులు కూడా వీరిని పట్టించుకోలేదు. తమకేమీ సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తించారు. దాంతో వారం రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నారు. అయినవారు ఎంతోమంది ఉండి చివరకు నా అనేవారు కరువై మార్కాపురం రైల్వే స్టేషన్ సమీపంలోని చెట్ల కింద ఉంటూ ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.
తమకున్న కొద్దిపాటి స్థలాన్ని వారే ఆక్రమించుకుని తమను అనాధలుగా మిగిల్చారంటూ కంటతడి పెట్టుకుంటున్నారు వృద్ధ దంపతులు. అయితే స్థానిక వాలంటీర్లకు విషయం తెలిసి వారి దగ్గరకు వెళ్లి విచారించి బాగోగులు చూస్తున్నట్లు తెలుస్తోంది.