ఏపీలో ఆ గ్రామానికి వస్తా: సోనూ సూద్, దేశానికే వారు స్ఫూర్తినిచ్చారంటూ ప్రశంస
ముంబై/విజయనగరం: కరోనా కష్ట కాలంలో అనేక వేల మందికి తన వంతుగా సాయం చేసి రియల్ హీరోగా మారిపోయిన ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ తన దాతృత్వాన్ని కొనసాగిస్తున్నారు. తనకు సాధ్యమైనంత వరకు సాయం చేస్తూనే ఉంటానని చెప్పారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని ఆదుకున్న సోనూ సూద్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామానికి వస్తానంటూ ట్వీట్ చేశారు. ఇందుకు ఆ గ్రామ ప్రజలు చేసిన ఓ మంచి పనే కారణం.
గ్రామస్తులకు సోనూ సూద్ అభినందనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కొదమ గ్రామ గిరిజనులు స్వచ్ఛందంగా చేపట్టిన రహదారి నిర్మాణంపై సోనూ సూద్ స్పందిస్తూ.. వారికి అభినందనలు తెలిపారు. ఎవరో సాయం చేస్తారని ఎదురుచూడకుండా గ్రామ ప్రజలు ఎంతో స్ఫూర్తిని ప్రదర్శించారని ప్రశంసించారు.
కొదమ ప్రజల కష్టాలు ఆ దేవుడికి తెలియాలి..
కాగా, 150 కుటుంబాలున్న కొదమ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. దీంతో నిత్యావసర వస్తువులు తీసుకెళ్లేందుకు, రోగులను ఆస్పత్రికి తరలించేందుకు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండలు, గుట్టల్లో వారికి కాలి నడకన తప్పడం లేదు. ఇక గర్భిణీలకు పురిటి నొప్పులు వస్తే వారి బాధ వర్ణనాతీతమే. గ్రామస్తులు డోలీ కట్టి సమీప ఆస్పత్రులకు తీసుకెళ్తుంటారు.
చేయి చేయి కలిపి ముందుకు సాగారు..
నిత్యావసరాల కోసం ఒడిశా సరిహద్దులో 4 కిలోమీటర్ల దూరాన ఉన్న బారి గ్రామంలోని సంతకు కాలికనడకనే వెళ్తుంటారు. సుదీర్ఘ కాలంగా ఉన్న ఈ సమస్యకు ముగింపు పలకాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులంతా కలిసి సంతకు వెళ్లే బారి గ్రామం వరకైనా రహదారిని నిర్మించుకోవాలని ముందుకు కదిలారు. ఒక్కో ఇంటికీ రూ. 2వేలు చొప్పున చందాలు సేకరించి రూ. 20లక్షల వరకు జమచేశారు. ఆ మొత్తంతో రెండు జేసీబీలను అద్దెకు తీసుకుని రెండు వారాలపాటు శ్రమించి కొండను తొలిచారు. మరో పదిరోజులపాటు మట్టిేసి నాలుగు కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించుకున్నారు.
దేశానికే స్ఫూర్తిగా నిలిచారంటూ సోనూ సూద్.. ఆ గ్రామానికి వస్తానంటూ..
ఈ నేపథ్యంలో కొదమ గ్రామ గిరిజనుల శ్రమకు సంబంధించిన కథనాలు పలు మీడియా సంస్థలు ప్రచురితం చేశాయి. ఈ కథనంకు సంబంధించిన వివరాలను ట్విట్టర్ వేదికగా తెలుసుకున్న సోనూ సూద్.. గిరిజన ప్రజల స్ఫూర్తిని అభినందించకుండా ఉండలేకపోయారు. యావత్ దేశానికి మీరు చేసిన పని ఎంతో స్ఫూర్తినిస్తుందని అన్నారు. అంతా కలిసి పనిచేస్తే ఏ సమస్యకైనా ముగింపు పలకవచ్చన్నారు. అంతేగాక, కొదమ గ్రామ ప్రజలను తాను కలుస్తానంటూ ట్విట్టర్ వేదికగా సోనూ సూద్ వెల్లడించారు.