మోహన్ భగవత్ తో చంద్రబాబు భేటీ వెనుక : ఆ స్వామీజీ సహకారంతో..! అసలు లక్ష్యం అదేనా..!
టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ వెనుక పరమార్ధం ఏంటి. బీజేపీతో సంబంధాల పునరుద్దరణ కోసమే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారా. ప్రస్తుతం ఏపీలోని రాజకీయ పార్టీల్లో సాగుతున్న చర్చ ఇది. నాగపూర్ లో చంద్రబాబు ఆరెస్సెస్ అధినేత తో భేటీ అయ్యారని..అది వ్యక్తిగత పర్యటన అని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే, చంద్రబాబు ఆయనతో భేటీ వెనుక తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వ్యవహరించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో బిజేపీ..జనసేనతో దూరంగా ఉన్న కారణంగానే టీడీపీ నష్టోయిందని టీడీపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. దీంతో..ప్రస్తుతం పార్టీలోనూ వలసలు పెరుగుతున్నాయి. తిరిగి బలోపేతం కావాలంటే పాత మిత్రులతో సత్సంబంధాల కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈ భేటీ జరిగినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు మిగిలిన పార్టీలు దూరంగా ఉన్నా చంద్రబాబు మద్దతు ప్రకటించారు.
మొహన్ భగవత్ తో భేటీ అందుకోసమేనా..
టీడీపీ అధినేత ఒక స్వామిజీ సహకారంతో ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ ను కలిసినట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీతో తిరిగి సంబంధాల కోసమే ఆయన ఆరెస్సెస్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానాలు ఈ ప్రచారంతో మొదలయింది. తొలుత మహారాష్ట్ర కు చెందిన ఒక కేంద్ర మంత్రి సహకారంతో ఈ భేటీ జరిగినట్లు చెప్పుకొచ్చారు. అయితే, బీజేపీకి చెందిన ఆ కేంద్ర మంత్రికి సంబంధం లేదని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా ఉండే ఒక స్వామీజీ సహకారంతోనే ఈ భేటీ జరిగిందనిన విశ్వసనీయ సమాచారం.
ఏపీలో కొద్ది కాలంగా జగన్ ప్రభుత్వం మీద బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ..ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఆ భేటీలో చంద్రబాబు వివరించినట్లుగా చెబుతున్నారు. కేవలం బీజేపీకి దగ్గరయ్యేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే, చంద్రబాబు మీద గుర్రుగా ఉన్న బీజేపీ అధినాయకత్వం ఈ ప్రయత్నాల ద్వారా మెత్త బడే అవకాశం ఉందా అంటే..కష్టమనే సమాధానం బీజేపీ నేతల నుండి వస్తోంది.
ఇటు..పవన్ తో సఖ్యతగా..
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఇప్పుడు ఇతర పక్షాలతో కలిసి పని చేయటానికి సిద్దం అవుతోంది. అందులో భాగంగా..బీజేపీ ఇప్పటికిప్పుడు తమతో కలసి పని చేయటానికి సిద్దంగా లేకపోయినా.. జనసేన తో సంబంధాలు కొనసాగించాలని టీడీపీ భావిస్తోంది. అందులో భాగంగానే ఇసుక సమస్య మీద పవన్ కళ్యాణ్ ఆహ్వానానికి చంద్రబాబు వెంటకే ఓకే చెప్పేసారు. బీజేపీ..కాంగ్రెస్...వామపక్షాలు మద్దతు ఇవ్వకపోయినా.. టీడీపీ నేతలు ఈ మార్చ్ లో పాల్గొంటున్నారు. ముగ్గురు మాజీ మంత్రులతో పాటుగా విశాఖ కు చెందిన నేతలు హాజరవుతున్నారు. వైసీపీని ఎదుర్కోవాలంటే ఇతర పార్టీలను కలుపుకొనే ముందుకు సాగాలని చంద్రబాబు భావిస్తున్నారు.
వైసీపీ ఎంతగా ప్రచారంగా చేసిన వారి ట్రాప్ లో పడకుండా టీడీపీ..జనసేన కలిసి ఏపీలో కలిసి సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో..వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు..మున్సిపల్ ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకొనే ఛాన్స్ ఉంది. ఈ రెండు పార్టీలు రాజకీయంగా ఒక్కటేనని ఇప్పటికే వైసీపీ నేతలు విమర్శలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు చెప్పిందే పవన్ ఫాలో అవుతారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో..విశాఖ మార్చ్ తరువాత ఈ మొత్తం వ్యవహారం మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.