మూడు రాజధానులతో జగన్ చెప్పిన దక్షిణాఫ్రికా కూడా నష్టపోయింది : యనమల
ఏపీ శాసనసభ సమావేశాల చివరి రోజు రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీ లో జరిగిన సుదీర్ఘ చర్చలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనప్రాయంగా ఎపీకి మూడు రాజధానులు ఉంటె బాగుంటుంది అని చేసిన ప్రకటనను ఎపీలోని ప్రతిపక్ష టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏపీకి మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు అనాలోచిత వ్యాఖ్యలని టీడీపీ మండిపడుతోంది.
జగన్ మూడు రాజధానుల వ్యాఖ్యలపై మండిపడిన యనమల
టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు జగన్ చేసిన ప్రకటనపై స్పందించారు. మూడు రాజధానులతో రాష్ట్రానికి నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం లేదని ఆయన విమర్శించారు.పాలనాపరమైన సమస్యలు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా తరహాలో మూడు రాజధానులు అని జగన్ చెప్పారని పేర్కొన్న యనమల వెనుకబడిన దేశాన్ని పరిగణనలోకి తీసుకున్నారని , అలా నిర్ణయం తీసుకుంటే వెనకబడతామని చెప్పారు.
అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకోవాలి.. దక్షిణాఫ్రికా వంటి వెనుకబడిన దేశంతో కాదు
ఎవరైనా ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు అభివృద్ధి చెందిన దేశాలను పరిగణనలోకి తీసుకుంటారా? లేక వెనుకబడిన దేశాలను తీసుకుంటారా? అని ప్రశ్నించారు యనమల రామకృష్ణుడు. ఇతర దేశాలతో పోల్చితే దక్షిణాఫ్రికా వెనుకబడిన దేశమని, ఇక దానితో ఏపీని సీఎం జగన్ పోల్చి చెప్తున్నారని ఆయన విమర్శించారు . మూడు రాజధానులతో దక్షిణాఫ్రికా కూడా నష్టపోయిందనిఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా ఉందని యనమల పేర్కొన్నారు.
జగన్ నిర్ణయం అదే అయితే ఉద్యోగులకు తప్పని తిప్పలు
జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు కూడా తిప్పలు తప్పవని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులు అతి కష్టం మీద హైదరాబాదు నుంచి అమరావతికి వచ్చారని, ఇప్పుడు వారిని మళ్లీ విశాఖకు తరలిస్తారా? అని యనమల జగన్ ను ప్రశ్నించారు. జగన్ ధోరణి ప్రాంతాల మధ్య ఘర్షణలకు కారణం అయ్యేలాఉందని ఆయన విమర్శించారు. ప్రజలు కూడా ఉద్వేగాలకు లోను కాకుండా తమ భవిష్యత్తు కోసం సరైన దిశలో ఆలోచించాలని యనమల సూచించారు.
తెలంగాణా అభివృద్ధి చెందేలా నిర్ణయం ఉందన్న యనమల
ప్రపంచంలో ఏ దేశానికైనా ఒకే రాజధాని ఉందని, తెలంగాణకు కూడా హైదరాబాద్ ఒకటే రాజధాని అని తెలిపారు. నిజాం కాలం నుంచి హైదరాబాద్ రాజధానిగా ఉందని యనమల పేర్కొన్నారు. నిపుణుల కమిటీ వేశారు..కదా..ఆ రిపోర్టు ఇంకా పెండింగ్లో ఉండగానే సీఎం జగన్ అసెంబ్లీలో ఎలా ప్రకటన చేస్తారని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్తో సన్నిహితంగా ఉంటూ..తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే విధంగా ప్రవర్తిస్తున్నారని, తుగ్లక్ లా పాలిస్తున్నారని తెలిపారు యనమల .
మూడు రాజధానుల ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ
ఇక ఇప్పటికే రాజధాని రైతులు సైతం జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు. ఆందోళనల బాట పట్టారు. ఈ నిర్ణయం సరైంది కాదని ఆందోళన చేస్తున్నారు. కావాలని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇక టీడీపీ ఈ నిర్ణయాన్ని ఒప్పుకునేది లేదని ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని అని తేల్చి చెప్తుంది.