నాలుగు స్టేషన్లు..అయిదున్నర లక్షల మంది ప్రయాణికులు: దక్షిణమధ్య రైల్వే సరికొత్త రికార్డు
హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే చరిత్రలో ఇప్పటికే అనేక మైలురాళ్లు ఉన్నాయి. ల్యాండ్ మార్క్ గా చెప్పుకోగల పలు విజయాలను అందుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం 17 రైల్వే జోన్లు ఉండగా.. ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది దక్షిణమధ్య రైల్వే. తాజాగా మరో ఘనతను అందుకుంది. నాలుగు స్టేషన్ల నుంచి ఏకంగా అయిదున్నర లక్షల మందికి పైగా ప్రయాణికులను గమ్యాస్థానాలకు చేర్చింది. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఈ రికార్డును సాధించింది. గురువారం లోక్సభ, శాసనసభ ఎన్నికల సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్లే వారి కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి), కాచిగూడ, లింగంపల్లి స్టేషన్ల నుంచి మూడు రోజుల్లో 5.58 లక్షల మంది ప్రయాణికులను స్వస్థలాలకు చేర్చింది. పోలింగ్ ముందు రోజైన 10వ తేదీ నాడు ఒక్కరోజే సికింద్రాబాద్ నుంచి లక్షా 24 వేల మంది ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు తరలి వెళ్లారు.
దశావతార ఆలయంలో పవన్ కల్యాణ్: అన్నదానం చేసిన జనసేన చీఫ్
ఏపీకి చెందిన ఓటర్లు లక్షల సంఖ్యలో జంటనగరాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో నివసిస్తున్నారు. వారందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాడనికి స్వస్థలాలకు వెళ్తారని ముందుగానే ఊహించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. వారికోసం వరుసగా మూడు రోజుల పాటు ప్రత్యేక రైళ్లను నడిపించారు. సాధారణ రోజుల్లో షెడ్యూల్ ప్రకారం రాకపోకలు సాగించే 150 రైళ్లకు అదనంగా 8,9,10 తేదీల్లో అదనపు రైళ్లను నడిపారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్ల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు మొత్తం 5,58,548మందిని చేరవేశారు.
సాధారణ రైళ్లతోపాటు ప్రత్యేక రైళ్లలో కలిపి మూడు రోజుల్లో 4,32,987మంది సాధారణ టికెట్ తీసుకుని ప్రయాణించగా.. 1,25,561 మంది ప్రయాణికులు ముందుగానే తమ టికెట్లను రిజర్వ్ చేసుకున్నారు. ఈ మూడు రోజుల వ్యవధిలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మొత్తం మొత్తం 3,38,558మంది సికింద్రాబాద్ ద్వారా తమ స్వస్థలాలకు తరలివెళ్లారు.నాంపల్లి స్టేషన్ నుంచి మొత్తం 70,231మంది, లింగంపల్లి స్టేషన్ నుంచి 85,382 మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకున్నారు. 64,377 మంది ప్రయాణికులు కాచిగూడ నుంచి వివిధ రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు తరలి వెళ్లారు.