ఏపీ-కర్నాటక మధ్య మరో ప్రత్యేక రైలు- మచిలీపట్నం టూ యశ్వంత్పూర్
కరోనా ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ క్రమంగా రైళ్ల రాకపోకలను సాధారణ స్ధితికి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఏపీ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లే పలు రైళ్ల రాకపోకలు క్రమబద్ధం అవుతుండగా... తాజాగా ఇతర రైల్వే జోన్లు కూడా ఇదే బాట పట్టాయి. తాజాగా నైరుతి రైల్వే ఏపీ-కర్నాటక మధ్య నడిచేలా ప్రత్యేక రైలును ఈ నెల 9న ప్రారంభిస్తోంది.
ఏపీ-కర్నాటక మధ్య ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం-యశ్వంత్పూర్ మధ్య ఈ నెల 9 నుంచి ఓ ప్రత్యేక రైలును నైరుతి రైల్వే నడపబోతోంది. వారానికి మూడుసార్లు ఈ ప్రత్యేక రైలు మచిలీపట్నం-యశ్వంత్పూర్ మధ్య రాకపోకలు సాగించనుంది. మచిలీపట్నం నుంచి మూడుసార్లు, యశ్వంత్పూర్ నుంచి మూడు రైళ్లు వారంలో రాకపోకలు సాగిస్తాయి. మచిలీపట్నం నుంచి సోమవారం, బుధవారం, శుక్రవారం, యశ్వంత్ పూర్ నుంచి మంగళవారం, గురువారం, శనివారం ఈ ప్రత్యేక రైళ్ల రాకపోకలు ఉంటాయి.
Recommended Video
మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాలకు ప్రతీ రైలు బయలుదేరుతుంది. మచిలీపట్నం నుంచి యశ్వంత్పూర్ వెళ్లే రైలుకు గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల, డోన్, గుత్తి, అనంతపూర్, ధర్మవరం, ప్రశాంతినిలయం, పెనుకొండ, హిందూపూర్, యలహంకలో స్టాప్లు ఇచ్చారు. ఈ ప్రత్యేక రైళ్లలో సీట్లన్నీ అడ్వాన్సెడ్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్లు నైరుతి రైల్వే తెలిపింది.