జగన్ చెప్పినా నందిగామ, ఆళ్లగడ్డపై సస్పెన్స్, సౌమ్యకి..
టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర రావు మృతితో నందిగామ ఉప ఎన్నిక అనివార్యమైంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మృతితో ఆళ్ళగడ్డ ఎన్నిక జరగాల్సి ఉన్నా ఈసీ మాత్రం ఆళ్లగడ్డను షెడ్యూలులో ప్రకటించలేదు. అయితే ఈ రెండు సీట్లలో ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే రెండు పార్టీలు మాట్లాడుకొని ఎవరి సీటు వారు తీసుకొని ఎన్నిక ఏకగ్రీవం చేసేవారన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.
ఈ రెండు సీట్లలో దివంగత ఎమ్మెల్యేల కుమార్తెలను నిలపాలని ఆయా పార్టీలు ఇప్పటికే అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నాయి. నందిగామలో తంగిరాల ప్రభాకర రావు పెద్ద కుమార్తె సౌమ్యను నిలపాలని ఆయన కుటుంబం, పార్టీ నిర్ణయించుకుంది. ఆళ్ళగడ్డలో శోభా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియను నిలపాలని ఆమె కుటుంబం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు నిర్ణయం తీసుకొన్నాయి. రెండుచోట్లా కూడా కుటుంబ సభ్యులే కావడంతో ఏకగీవ్రం తేలికగా జరిగే వీలుండేది.
కానీ, ఒక ఎన్నిక వాయిదా పడటంతో ఆ పార్టీల మధ్య ఒప్పందానికి అవకాశం లేకుండా పోయిందంటున్నారు. అయితే, ఇప్పటికి జగన్ పార్టీ మాత్రం నందిగామలో పోటీ చేయాలని భావిస్తోంది. నందిగామను ఏకగ్రీవం చేయకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేస్తే.. తర్వాత జరిగే ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేసే అవకాశముంది.
ఇప్పుడు జగన్ పోటీ చేస్తామని చెప్పినా.. ఇరు పార్టీలు మాట్లాడుకుంటే ఏకగ్రీవం అయ్యే అవకాశాలు లేకపోలేదంటున్నారు. టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ... తంగిరాల ప్రభాకర్ కూతురు సౌమ్యను తాము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందిగామ నుండి పోటీలో నిలబెడతామని చెప్పారు.