తన మైనపు విగ్రహాన్ని చేయించుకున్న ఎస్పీ బాలు .... విగ్రహం చూడకుండానే అస్తమయం
గాన గంధర్వుడు , సంగీత ప్రపంచంలో రారాజు ఎస్పీ బాలు మృతి ఎవరూ జీర్ణించుకోలేకపొతున్నారు . స్వర సామ్రాట్ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినిమా ప్రపంచాన్ని శోక సముద్రంలో ముంచి స్వర్గానికి చేరిపోయారు. ఆయన తన మరణానికి ముందే తన విగ్రహాన్ని తయారు చేయించుకున్నారు.ఎస్పీ బాలసుబ్రమణ్యం తన తల్లిదండ్రుల శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ ల విగ్రహాలను నెల్లూరు జిల్లాలోని తన సొంత ఇంట్లో పెట్టాలని భావించారు. అందులో భాగంగా ఆయన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట కు చెందిన ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ ను తన తల్లిదండ్రుల విగ్రహాలను రూపొందించాలని కోరారు. ఆ తర్వాత తన శిల్పాన్ని కూడా రూపొందించమని శిల్పి రాజ్ కుమార్ కు చెప్పారు.
Recommended Video
తెలుగు భాషకు పట్టం కట్టిన ఎస్పీ బాలు ... స్వరాభిషేకం చేసి మరీ వర్ధమాన గాయకులకు మార్గదర్శిగా..
మరణానికి ముందే తన మైనపు విగ్రహాన్ని తయారు చేయించుకున్న ఎస్పీ బాలు
ఎస్పీ బాలు తన విగ్రహాన్ని చూసుకోవాలని ముచ్చట పడ్డారని కానీ అది చూడకుండానే ఆయన కన్నుమూశారని శిల్పి రాజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలు తండ్రి పండితారాధ్యుల సాంబమూర్తి మరణానంతరం విగ్రహం తయారు చేయించి తన తండ్రి విగ్రహాన్ని నెల్లూరులోని శ్రీ వేంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో ఆవిష్కరించారు. ఎనిమిది అడుగుల ఎత్తులో ఆ విగ్రహాన్ని తయారు చేశారు.ఆ తర్వాత మళ్లీ తన తల్లిదండ్రుల విగ్రహాలను తయారు చేయాలని బాలసుబ్రమణ్యం ఆగస్టు 1వ తేదీన రాజ్ కుమార్ కు ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత తన విగ్రహం కూడా తయారు చేయమని చెప్పారు.
తన తల్లిదండ్రుల విగ్రహాలు నెల్లూరులోని తన ఇంటి వద్ద పెట్టాలని బాలు ఆకాంక్ష
బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు లో ఉన్న తన ఇంటిని వేద పాఠశాలకు ఇస్తున్నానని, అక్కడ తన తల్లిదండ్రుల విగ్రహాలు పెట్టాలని అని చెప్పినట్లుగా సమాచారం. ఆగస్టులోనే ఆ విగ్రహాలను ఆవిష్కరించవలసి ఉంది. అయితే ఆయనకి ఈ లోపు కరోనా వైరస్ సోకడంతో బాలసుబ్రమణ్యం ఆ విగ్రహాలను ఆవిష్కరించ లేకపోయారు. తన తల్లిదండ్రులు విగ్రహాలను చేయమని చెప్పిన సమయంలోనే తన విగ్రహాన్ని కూడా తయారు చేయాలని, చూసుకుంటానని ముచ్చటపడిన బాలసుబ్రమణ్యం ఆ కోరిక తీరకుండానే మృతి చెందారు .
ఆయన పుట్టిన రోజునే విగ్రహం ఇవ్వాలనుకున్నా ... కానీ
బాలసుబ్రమణ్యంతో తనకు ఎనిమిదేళ్ల పరిచయం ఉందని,గతంలో ఓ సారి తన వద్దకు వచ్చిన సమయంలో ఫోటో షూట్ చేసి నమూనా తయారు చేశానని, ఈ మధ్యనే ఆయన విగ్రహానికి తుది మెరుగులు దిద్ది అని, ఆయన తిరిగి వచ్చి చూసుకుంటాడు అని ఆశ పడ్డానని శిల్పి రాజ్ కుమార్ పేర్కొన్నారు. జూన్ 4వ తేదీన ఆయన పుట్టిన రోజు . ఆయన పుట్టినరోజుకు విగ్రహాన్ని ఆయన ఇవ్వాలని అనుకున్నానని, కానీ కరోనా కారణంగా సాధ్యం కాలేదని తెలిపారు.
కరోనా తర్వాత విగ్రహం వచ్చి చూస్తానన్న ఎస్పీ బాలు .. చూడకుండానే అస్తమయం
ఈ ఏడాది జనవరిలో బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారాన్ని తనకు ప్రకటించారని, అయితే ఆ అవార్డు కార్యక్రమం వాయిదా పడిందని చెప్పారు . ఆయన కోరిక మేరకు ఎస్పీ బాలు మైనపు విగ్రహాన్ని చెన్నైలోని ఆయన ఇంటికి పంపిస్తానని చెప్పుకొచ్చారు. కరోనా తర్వాత వచ్చి చూస్తా అన్న బాలసుబ్రమణ్యం రాకుండానే వెళ్లిపోయారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయనకు తల్లిదండ్రులంటే ఎనలేని గౌరవం అని తెలిపిన శిల్పి , ఎంత ఎదిగినా ఒదిగి ఉండే , అందరితో సరదాగా మాట్లాడే గాన గంధర్వుడు లేని లోటు తీర్చలేనిదన్నారు .