పొలంలో వరి నాట్లేసిన ఎస్పీ ... వ్యవసాయకూలీలే కాదు పోలీసులు ఫిదా !!
కరోనా లాక్ డౌన్ సమయంలో అరుదైన దృశ్యాలు కనపడుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం రాజులపాలెం గ్రామంలో పొలాల్లో రైతు కూలీలతో కలిసి పొలంలో నాట్లేశారు తిరుపతి పోలీస్ బాస్ . బూట్లు విడిచి , పాంట్ పైకి మడిచి , కాడి చేతబట్టి దుక్కి పదును చేసి , రైతు కూలీలతో కలిసి హుషారుగా నాట్లు వేశారు. అదేదో ఫోటోల కోసం అనుకుంటే పొరబాటే.
వ్యవసాయ కూలీలతో కలిసి వారి నాట్లేసిన ఎస్పీ
వ్యవసాయ నేపధ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన యాసాయం చెయ్యటంలో ఉన్న గొప్పతనం బాగా తెలిసిన వాడు. అందుకే వ్యవసాయ కూలీలతో కలిసి నాట్లేసి వారిలో ఉత్సాహం నింపారు. ఎడ్లతో దుక్కి పదును చేసి చాలా ఉత్సాహంగా మండుటెండను సైతం లెక్క చెయ్యక ఆయన వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు. అక్కడే ఉండి చూసిన పోలీసులు సైతం ఆయన పని తీరుకు షాక్ అయ్యారు. ఇక గ్రామస్థులు, ఆ పొలాల్లో వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఆయన వ్యవసాయ పనులు చేస్తున్న విధానానికి ఫిదా అయ్యారు . ఇక ఆయన కూడా శ్రమ జీవన సౌందర్యాన్ని ఆస్వాదించారు.
కరోనా లాక్ డౌన్ సమయంలో గ్రామాల ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ
తిరుపతి ఎస్పీ ఆవుల రమేష్రెడ్డి కరోనా లాక్ డౌన్ సమయంలో నిత్యావసరాలు అందక ఇబ్బంది పడుతున్నగ్రామాల్లో నిత్యావసరాలు అందించటానికి వచ్చిన ఆయన ఒక్కసారిగా వూరి పొలాల్లో నాట్లు వేస్తున్న దృశ్యాలు చూసి తానూ వారితో కలిసి ఉత్సాహంగా వ్యవసాయ పనులు చేశారు. తాను వ్యవసాయ కుటుంబం నుండే వచ్చానని, ఆ నేపధ్యం ఎప్పటికీ మరచిపోలేను అని ఆయన ఈ సందర్భంగా అక్కడ గ్రామస్థులతో చెప్పారు. వ్యవసాయ కూలీలందరికీ నిత్యావసరాలు పంపిణీ చేశారు.
Recommended Video
వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఎస్పీ
ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి అక్కడ వాళ్లందరికీ నిత్యావసర సరుకులు, అరటిపండ్లు, మాస్కులు పంపిణీ చేసి మాట్లాడారు. తానూ వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చానన్నారు. పుట్టుకతో పిల్లలకు భాష ఎలా నేర్పుతామో , ఎంత ప్రాధాన్యత ఇస్తామో అలాగే వ్యవసాయానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ పల్లెలన్నీ పచ్చదనంతో ఉండటం సంతోషం అని చెప్పారు. కరోనాకు దూరంగా ఉండటం తనకెంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.