కోరిక తీర్చు: గుంటూరు ఎస్పీ ఆఫీసులో మహిళపై లైంగిక వేధింపులు
గుంటూరు: జిల్లాలోని ఎస్పీ ఛాంబర్కు అతి సమీపంలో ఉండే కార్యాలయంలోనే ఓ జూనియర్ అసిస్టెంట్ లైంగిక వేధింపులకు గురైంది. దీంతో ఆమె మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం నగరంలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ కార్యాలయంలోని పైఅంతస్తులో పరిపాలన విభాగంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ మాధవి గురువారం మధ్యాహ్నం కార్యాలయంలో ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
కానిస్టేబుల్గా పని చేసే ఆమె తండ్రి సాంబయ్య చనిపోవడంతో ఆమెకు పోలీసు కార్యాలయంలో మినిస్టీరియల్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇచ్చారు. పోలీసు అధికారులు, సిబ్బందికి సంబంధించి హెచ్ఆర్ఏ బిల్లులను ఆమె చూస్తూ ఉంటారు. బీ సెక్షన్ సూపరింటెండెంట్గా పనిచేసే కరీముల్లా తన కోరిక తీర్చాలంటూ ఆమెను వేధింపులకు గురిచేశాడు.
తన లైంగిక వేధింపులకు లొంగకపోవడంతో ఆమెపై వేధింపులు మరితంగా పెంచాడు. దీంతో చేసేదేమీ లేక బాధితురాలు నేరుగా గత సోమవారం అర్బన్ ఎస్పీ త్రిపాఠిని కలిసి ఫిర్యాదు చేసింది. వేధింపులకు సంబంధించి తన వద్ద ఉన్న ఫోన్ రికార్డ్స్, సీడీలను సైతం అర్బన్ ఎస్పీకి అందించింది. దీంతో ఈ వ్యవహారంపై అర్బన్ ఎస్పీ విచారణకు ఆదేశించారు.
గత నాలుగు నెలలుగా బాధితురాలి పట్ల ఈ వేధింపులు కొనసాగుతున్నాయి. ఎస్పీకి ఫిర్యాదు తర్వాత బాధితురాలిపై వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మాధవి ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది.
దీంతో వెంటనే ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. కాగా, మాధవిని లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీ సెక్షన్ సూపరింటెండెంట్ కరీముల్లాను బదిలీ చేస్తామని బాధితురాలి భర్తకు పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.