30 కెమెరాలతో ఇంటి వద్ద నిఘా: ముద్రగడకు ఎస్పీ మరో షాక్, కడపకు ర్యాలీ.. రామానుజయ అరెస్ట్
కిర్లంపూడి: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు ఎస్పీ షాకిచ్చారు. ముద్రగడ హౌస్ అరెస్ట్ 48 గంటలకే పరిమితం కాదని, పొడిగించవచ్చునని చెప్పారు. ముద్రగడ ఇంటి వద్ద 30 కెమెరాలతో నిఘా ఉంచినట్లు తెలిపారు.
ముద్రగడ యాత్రలో అసాంఘిక శక్తులు చొరబడే అవకాశముందనే సమాచారంతోనే హౌస్ అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సుప్రీం కోర్టు సూచనల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని చెప్పారు. గృహ నిర్బంధాన్ని పొడిగించవచ్చునని అన్నారు. ముద్రగడ ర్యాలీకి అనుమతి లేదన్నారు. లిఖితపూర్వకంగా రాసిస్తే పరిశీలిస్తామని చెప్పారు.
కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ అరెస్ట్
కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయతో పాటు మరో 24 మందిని మంగళగిరి రూరల్ పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు పోటీగా బుధవారం ఇడుపులపాయ నుంచి కడప జిల్లాకు పాదయాత్ర చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు.
ఇందులో భాగంగా విజయవాడ నుంచి 30 వాహనాలలో తన అనుచరులతో కలిసి బయలుదేరారు. అయితే, రామానుజయ కాన్వాయ్ని పోలీసులు కాజ టోల్ గేటు వద్ద అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని చెబుతూ ఆయనతో పాటు మరో 24 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం వారిని స్టేషన్ బెయిల్ పైన విడుదల చేశారు.