సిఎం నోటీసుపై టి వర్సెస్ సీమాంధ్ర: ఇరకాటంలో స్పీకర్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును తిప్పి పంపించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటీసు ఇవ్వడంతో ఇప్పుడు సభాపతి నాదెండ్ల మనోహర్ ఇరకాటంలో పడ్డారు. సిఎం శనివారం ఇచ్చిన నోటీసు అంశాన్ని స్పీకర్ శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) ముందు పెట్టనున్నారు. ఒకవైపు కిరణ్ వేసిన బౌన్సర్, మరోవైపు నోటీసును తిరస్కరించాలంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేల విన్నపాలు, ఒత్తిళ్ళతో స్పీకర్ తలమునకలు అవుతున్నారు.
సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల ఎత్తుగడలతో తాను అప్రతిష్టకు గురికాకూడదని మనోహర్ భావిస్తున్నారు. అందుకే శాసనసభ వ్యవహారాల సలహా సంఘాన్ని సమావేశపర్చి చర్చించడం మేలని భావనకు వచ్చారట. బిఏసిలోను ఏకాభిప్రాయం వస్తుందన్న నమ్మకం లేకున్నా, వ్యవహారం తనను చట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ బిఏసి నిర్వహించకుండా బిల్లును తిప్పి పంపించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయిస్తే తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలంతా గొడవ చేస్తారు. సీమాంధ్ర వ్యక్తి అయినందువల్లే పక్షపాతం చూపించారనే అపవాదును ఎదుర్కోవాల్సి వస్తుంది.
ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసును తిరస్కరిస్తే సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు ఆయనను దోషిగా నిలబెట్టే ప్రయత్నిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా బిఏసిని నిర్వహించి, ఏ నిర్ణయం వచ్చినా దాన్ని అనుసరిస్తే మంచిదని సభాపతి భావిస్తున్నారట. ఒకవేళ ఏకాభిప్రాయం రానిపక్షంలో ఇక మిగిలిన మూడు రోజులూ సభను ఏదోవిధంగా నడిపించేందుకు కృషి చేయాలని ఆయన అనుకుంటున్నారట. ఈ రోజు మధ్యాహ్నం బిఏసి సమావేశం జరిగే అవకాశాలున్నాయి.
సామాన్యంగా పాలక, విపక్షాల సభ్యులు ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటారు. కానీ ఇప్పుడు పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు, తెలంగాణ ఎమ్మెల్యేలు పోటీలు పడుతున్నారు. సోమ, మంగళవారాలు అసెంబ్లీ ప్రారంభంకాగానే తెలంగాణకు చెందిన టిడిపి, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు. దీంతో సభాపతి సభను వాయిదా వేస్తూ వస్తున్నారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే గంటపాటు వాయిదా పడింది.
నోటీసును ఆమోదించాలని సీమాంధ్ర నేతలు, తిరస్కరించాలని తెలంగాణ ప్రాంత నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసును అసెంబ్లీ రూల్స్లోని 81 ప్రకారం తిరస్కరించాలని స్పీకర్ను తెలంగాణ నేతలు కోరుతున్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ రూల్స్లోని 77 ప్రకారం స్పీకర్కు ఇచ్చిన నోటీసుపై తీర్మానం ఆమోదించాల్సిందేనని సీమాంధ్ర నేతలు చెబుతున్నారు. సిఎం నోటీసు ఆమోదించాల్సిందేనని, ఒకవేళ ఎవరైనా తీర్మానాన్ని వ్యతిరేకించాలని అనుకుంటే సభలో అదే విషయాన్ని చెప్పుకోవాలని పిసిసి చీఫ్ బొత్స హితవు పలికారు.
కాగా, మంగళవారం శాసన సభ ప్రారంభం కాగానే వాయిదా పడింది. ఇరు ప్రాంతాల నేతలు పోడియాన్ని చుట్టుముట్టారు. గందరగోళం ఏర్పడటంతో సభను గంటపాటు వాయిదా వేశారు. మండలి కూడా గంటపాటు వాయిదా పడింది. అనంతరం సీమాంధ్ర టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ... విభజన బిల్లుపై చర్చ సందర్భంగా సభలో ఏం మాట్లాడాలో చెప్పడానికి జైరామ్ రమేష్ ఎవరని ప్రశ్నించారు.