స్పీకర్ కోడెలకు అస్వస్థత...కార్యక్రమం మధ్యలోనే ఇంటికి!
గుంటూరు:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ హఠాత్తుగా అస్వస్థతకు లోనయ్యారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని నరసరావుపేటలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన స్పీకర్ కోడెల అనంతరం జరిగిన కార్యక్రమంలో అస్వస్థతకు గురయ్యారు.
స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేటలోని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ స్మశాన వాటికలను శుభ్రం చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. క్రిస్టియన్ స్మశాన వాటిక పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో కోడెల ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించుకుని ఆయన ఇంటికి వెళ్లిపోయారని తెలిసింది.
అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని నరసరావుపేటలోని తన కార్యాలయంలో డాక్టర్ కోడెల మహత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుతో పాటు యువనేత డాక్టర్ కోడెల శివరామ్, మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా తదిదరులు పాల్గొన్నారు.
అనంతరం నరసరావుపేట పట్టణంలోని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్శశానవాటికల్లో స్వచ్చభారత్ కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకర్ కోడెల నేడు గాంధీ జయంతి సంధర్భంగా అనేక స్వచ్చభారత్ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.
భారతదేశానికి అహింసా మార్గంలో స్వేచ్ఛభారత్ సాధించిన వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు.స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడచినా ఆయన కలలు గన్న స్వచ్చభారత్ దేశంలో నేటికి రాలేదన్నారు.ఆయన కోరుకున్న స్వచ్చభారత్ కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు.
గాంధీకి నిజమైన నివాళిగా గ్రామాల్లో మరుగుదొడ్లు, శ్శశానవాటికలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని...అదే ఆయనకు ఘనమైన నివాళి అవుతుందని స్పీకర్ కోడెల పేర్కొన్నారు.
తొలుత ముస్లిం స్మశాన వాటికలో జరిగిన స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం క్రిస్టియన్ శ్మశానవాటిక శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొంటుండగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించుకున్న స్పీకర్ కోడెల వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఆయన అస్వస్థతకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.