బాధపడిన స్పీకర్, వీడియో చూడలేక జగన్ బయటకు, 'సాక్షిపై చర్యలు తీసుకోవాల్సిందే'
తాను మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో అనని మాటలను అన్నట్లు చూపారని, ఇది చాలా బాధాకరమని, తన కుటుంబాన్ని కూడా సోషల్ మీడియాలో టార్గెట్ చేశారని స్పీకర్ కోడెల శివప్రసాద రావు గురువారం సభలో అన్నారు.
అమరావతి: తాను మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో అనని మాటలను అన్నట్లు చూపారని, ఇది చాలా బాధాకరమని, తన కుటుంబాన్ని కూడా సోషల్ మీడియాలో టార్గెట్ చేశారని స్పీకర్ కోడెల శివప్రసాద రావు గురువారం సభలో అన్నారు.
తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూశారన్నారు. సభలో స్పీకర్ కోడెల శివప్రసాద రావు మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో మాట్లాడిన వీడియోను ప్లే చేశారు. ఆ తర్వాత ఈ అంశంపై చర్చ జరిగింది.
కోడెల ఆవేదన
కోడెల తమను టార్గెట్ చేసినందుకు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేయడం అన్యాయం, అక్రమం అన్నారు. నా కొడుకు, కోడల్ గురించి అసభ్యంగా సోషల్ మీడియాలో పెట్టారన్నారు.
జగన్ చేతిలో సాక్షి మేనేజ్మెంట్
స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి మీడియాపై చర్యలు తీసుకోవాలని మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు అన్నారు. సాక్షి ఎడిటర్ను సభకు పిలవాలని డిమాండ్ చేశారు. జగన్ తప్పు చేయకుంటే సభ నుంచి ఎందుకు బయటకు వెళ్లాలో చెప్పాలని నిలదీశారు.
ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేసి వెళ్తున్నారన్నారు. సాక్షి మేనేజ్మెంట్ మొత్తం జగన్ చేతిలో ఉందన్నారు. జగన్తో పాటు అందరూ స్పీకర్ చేసిన వీడియోలు చూడాలన్నారు. స్పీకర్ ప్రతిష్టను కించపర్చడం అంటే రాష్ట్రాన్ని కించపర్చినట్లే అన్నారు.
లోకేష్ ఫోటోలు అభ్యంతరకరంగా: విష్ణు కుమార్
స్పీకర్ పైన అనుచితంగా ప్రసారం చేయడం సాక్షి మీడియాకు సరికాదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు. నారా లోకేష్ పైన కూడా అసభ్యకర రీతిలో ఫోటోలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టడం బాగా ఎక్కువయిందన్నారు. తప్పు చేసిన వారిని సస్పెండ్ చేస్తేన సభ సజావుగా సాగుతుందన్నారు. సోషల్ మీడియాలో అనైతిక చర్యలకు అడ్డుకట్ట వేయాలన్నారు.
ప్రతిపక్ష సభ్యులు సభకు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్తారో తెలియదన్నారు. నిజాలు చూడటానికి వారికి ఇష్టంలేనందునే వారు వీడియో ప్రదర్శించే ముందు సభ నుంచి బయటకు వెళ్లిపోయారని తప్పుబట్టారు.
బయటకు వెళ్లి ధర్నా ఎందుకు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేయడాన్ని టిడిపి సభ్యురాలు వంగలపూటి అనిత ప్రశ్నించారు. వారు బయటకు వెళ్లి ధర్నా చేయడం ఏమిటని నిలదీశారు.