ఐఎఎస్ అధికారులతో స్పీకర్ కోడెల సమావేశం:కోడెలవి సిగ్గుమాలిన చర్యలంటున్న వైసిపి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఐఏఎస్ అధికారులతో సమావేశం అయ్యారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో జాగ్రత్త వహించాల్సిన అంశాల గురించి స్పీకర్ కోడెల ఐఎఎస్ లతో చర్చించారు.
ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ సభ్యుల ప్రశ్నలన్నింటికీ సమాధానాలు అందేలా చూడాలని సూచించారు. గురువారం నుంచి 9 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని, నాలుగైదు రోజులు సమావేశాలను పొడిగించే అవకాశం కూడా ఉందని కోడెల చెప్పారు. ఈ సమావేశంలో స్పీకర్ కోడెలతో పాటు శాసన మండలి చైర్మన్ ఫరూక్, సీఎష్ దినేష్ కుమార్, డీజీపీ ఠాకూర్ తదిదరులు పాల్గొన్నారు.
ఎపి అసెంబ్లీ వర్షకాల సమావేశాల తేదీలు కొద్ది రోజుల క్రితమే ఖరారైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ కోడెల నిర్ణయించారు. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 9 గంటల 45 నిమిషాలకు శాసనసభ వర్షకాల సమావేశాలు ప్రారంభమవుతాయి.
సెప్టెంబర్ 6 నుంచి 19వ తేదీ వరకూ సమావేశాలు కొనసాగుతాయి. ఇందులో సెలవులు మినహాయిస్తే మొత్తం 8 రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. 8,9,13,14,15,16 తేదీల్లో శాసనసభకు సెలవులుగా నిర్ణయించారు. దీనిపై 6న జరిగే బీఏసీ సమావేశం తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది.
మరోవైపు పార్టీ ఫిరాయింపుదార్లపై అనర్హత వేటు వేస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వెళ్తామని వైసిపి ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. స్పీకర్ స్థానాన్ని కోడెల శివప్రసాదరావు అవమానపరుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. స్పీకర్ కోడెల టీడీపీ సభల్లో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారన్నారు. కోడెల సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతున్నారని...సీఎం చంద్రబాబు ఫొటోకు పాలాభిషేకం చేసేంత హీన స్థితికి స్పీకర్ దిగజారారని మండిపడ్డారు. స్పీకర్ కోడెల అసెంబ్లీని టీడీపీ ఆఫీసులా మార్చేశారని వైసీపీ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు.