యునిసెఫ్ సదస్సు కోసం స్పీకర్ కోడెల బృందం హర్యానా పర్యటన:రేపు రాష్ట్రానికి రాక
అమరావతి: హిమాచల్ ప్రదేశ్ లో యునిసెఫ్ ఆధ్వర్యంలో జరిగిన 'తల్లీ బిడ్డల ఆరోగ్యం' సదస్సుల్లో పాల్గొనేందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు నేతృత్వంలో బయలుదేరి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రతినిధుల బృందం శుక్రవారం రాష్ట్రానికి తిరిగి రానుంది.
ఈ నెల 9 వ తేదీన నాలుగు రోజుల పర్యటన కోసం అమరావతి నుంచి హర్యానా, హిమాచల్ ప్రదేశ్ పర్యటన కోసం వెళ్లిన ఎపి బృందం 'తల్లీ బిడ్డల ఆరోగ్యం' అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గోవడంతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఆరోగ్య పథకాల అమలును పరిశీలించింది. తొలి రోజు హర్యానా రాజధాని చండీఘర్ కు చేరుకున్న బృందం అక్కడ జరిగిన భేటీ బచావో...భేటీ పడావో, లింగనిర్ధారణ పరీక్షల నిరోధక చట్టం, సివిల్ రిజిస్ట్రేషన్ల ద్వారా జనన ధ్రువీకరణ పత్రాల జారీ అనే అంశాలపై జరిగిన సదస్సులో ఈ బృందం పాల్గొంది.
అనంతరం 10వ తేదీన హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో స్పీకర్ కోడెల నేతృత్వంలోని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిథులు పర్యటించారు.
ఆ రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య పథకాల గురించి అధ్యయనం చేశారు. మూడో రోజు ఏప్రిల్ 11వ తేదీన సిమ్లా నుంచి బయలుదేరి, మండి జిల్లా కేంద్రంలో పర్యటించారు. అక్కడ పలు ప్రభుత్వ ఆసుపత్రలను సందర్శించారు.
ఆయా ఆసుపత్రుల్లో అందిస్తున్నవైద్య సేవలు, గర్భిణుల పట్ల తీసుకుంటున్న చర్యలు, ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ యోజన(పీఎంఎస్ఎంఎ) పథకం అమలు తీరును, ఎఎన్ఎంలు, ఇతర ఆరోగ్య వర్కర్ల పనితీరు ను పరిశీలించారు.
ఇలా తమ మూడు రోజుల పర్యటనలో ఆ రెండు రాష్ట్రాల్లో గర్భిణుల ఆరోగ్య రక్షణకు తీసుకుంటున్న చర్యలు, ఆశా వర్కర్ల పాత్ర, మాతా శిశు మరణాలు తగ్గించడం, తల్లీ పిల్లలకు మౌలిక వసతులు కల్పించడం, డయేరియా మేనేజ్మెంట్, అంగన్వాడీల ద్వారా పిల్లల ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై బృందం అధ్యయనం చేయడమే కాకుండా అక్కడ సమీక్షా సమావేశాల్లోనూ పాల్గొంది. 12 వతేదీన తమ పర్యటన ముగించుకున్న బృందం 13 వ తేదీ ఉదయానికి రాష్ట్రానికి చేరుకోనున్నట్లు స్పీకర్ కోడెల కార్యాలయం తెలిపింది.
స్పీకర్ కోడెల నేతృత్వం వహించిన ఈ బృందంలో ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బి.అశోక్, వై.సాంబశివరావు, ఎం.గీత, వి.అనిత, టి.సౌమ్య, ఎం.సుగుణమ్మ, కె.అప్పలనాయుడు, పీలా గోవింద సత్యనారాయణ, ఎ.రాధాకృష్ణ. ఎమ్మెల్సీలు జి. శ్రీనివాసులు, వై.శ్రీనివాసులురెడ్డి, కె,నరసింహారెడ్డి, జి.సంధ్యారాణి, పి.శమంతకమణి, అసెంబ్లీ ఇన్ ఛార్జ్ సెక్రటరీ విజయరాజుతో పాటు ఆయా రాష్ట్రాల మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, యూనిసెఫ్ ప్రతినిధులు తదిదరులు ఉన్నారు.