ఎక్కువమందికి ఇస్తా: స్పీకర్, రాజ్యసభపై బొత్సVsజెసి
అనంతరం సభ తిరిగి ప్రారంభమైంది. ఈ సమయంలో సభాపతి మాట్లాడుతూ.. బిల్లు పైన సభ్యులు మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నారని, సాధమైనంత ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఒక్క ోసభ్యుడికి మూడు నుండి నాలుగు నిమిషాల సమయం ఇవ్వాలని సభాపతి నిర్ణయించారు.
బిల్లుకు సహకరించాలి: కోమటిరెడ్డి
బిల్లుకు అందరు సహకరించాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. నిన్న సభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభా నాయకుడిగా మాట్లాడారా లేక పీలేరు ఎమ్మెల్యేగా మాట్లాడారా చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన లెక్కలన్నీ అవాస్తవమన్నారు.
నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ దుస్థితికి తాను సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. హైదరాబాదు అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల భూములు కోల్పోయారు కానీ ఉద్యోగాలు మాత్రం లభించలేదన్నారు. బీబీనగర్ నిమ్స్కు ఇంత వరకు నిధులివ్వలేదని, అదే చిత్తూరు జిల్లాకు భారీగా నిధులు కేటాయించారని ఆరోపించారు.
ఉద్యమం వచ్చింది అందుకే: ఆరేపల్లి
పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాలేదు కాబట్టే తెలంగాణ ఉద్యమం వచ్చిందని ఆరేపల్లి మోహన్ అన్నారు. తెలంగాణ బిల్లు పైన సూచనలు చేయాలని, సహకరించాలని కోరారు.
జగన్ తీరు మోసమే: దూళిపాళ్ల
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు ఉండాల్సింది సభలో అని, ఆటాడాల్సింది మైదానంలో అని, రెండు వదిలి పారిపోతు సమైక్యవాదం వినిపించడం ప్రజలను మోసగించడమేనని టిడిపి సీమాంధ్ర నేత దూళిపాళ్ల నరేంద్ర అంతకుముందు మీడియా పాయింటు వద్ద అన్నారు. మంత్రి బాలరాజు సీమాంధ్రకు ద్రోహం చేస్తుంటే తెరాస మద్దతు పలకడం కుట్రలో భాగమే అన్నారు.
జెసిVsబొత్స
అసెంబ్లీ ప్రాంగణంలో మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. రాజ్యసభ సీటు కోసం జెసి సంతకాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. దీనినే బొత్స ప్రశ్నించారు.
ఇదేం పద్ధతని, రాజ్యసభ నామినేషన్ పత్రాల పైన ఎమ్మెల్యేలతో సంతకాలు ఎందుకు చేయిస్తున్నారని, కాపులను దెబ్బతీయాలని చూస్తున్నారా అని జెసిని బొత్స ప్రశ్నించారు. దానికి జెసి స్పందిస్తూ... తాను చేసిన దాంట్లో తప్పేముందని, తనకు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నానని సమాధానం ఇచ్చారు. కాగా, తాను రాజ్యసభ అంశంపై జెసిని ఏమీ అడగలేదని బొత్స విలేకరులతో చెప్పారు. బొత్సతో డిఎల్, డిప్యూటి సిఎం భేటీ అయ్యారు.