ప్రశ్నలు, ఎదురు ప్రశ్నలతో ఏపీ అసెంబ్లీలో రచ్చ .. టీడీపీ నేతలపై స్పీకర్ ఆగ్రహం
ఏపీ అసెంబ్లీలో ముఖ్యమైన విషయాలపై చర్చ జరిగే కంటే రాద్దాంతం ఎక్కువ జరుగుతుంది. ఒకరి మీద ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవటం , తిట్టిపోసుకోవటం ఏపీ ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది. ఇక ఈ రోజు సమావేశాల్లో భాగంగా ప్రశ్నల వర్షం కురుస్తుంది. ఒకరి మీద ఒకరు శరపరంపరలా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఏకంగా స్పీకర్ కే టీడీపీ నాయకులు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
సభలో అచ్చెన్నాయుడికి స్పీకర్ సూచన .. అచ్చెన్న అసహనం ...
ఏపి స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మంగళవారం అసెంబ్లీలో టిడిపి సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట మాట్లాడిన టిడిపి చీఫ్, ప్రతిపక్ష నాయకుడు ఎన్ చంద్రబాబు నాయుడు, వారి తరపున మాట్లాడటానికి అచ్చన్నాయుడికి అవకాశం ఇవ్వాలని అన్నారు. ఇందుకోసం స్పీకర్ అచ్చన్నాయుడికి సభలో మాట్లాడటానికి అవకాశం కల్పించారు . అయితే, అచ్చన్నాయుడికి తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు, స్పీకర్ కేవలం సబ్జెక్ట్ పై మాట్లాడమని చెప్పారు అంతే కాకుండా త్వరగా ముగించాలని సూచించారు . దీంతో అచ్చెన్నాయుడు అసహనానికి గురయ్యాడు.
స్పీకర్ స్క్రిప్ట్ ఇస్తే చదువుతానన్న అచ్చెన్న . .. ఏం మాట్లాడుతున్నారంటూ స్పీకర్ ఆగ్రహం
దీనిపై స్పందిస్తూ, అచ్చన్నాయుడు స్పీకర్తో నేను సబ్జెక్ట్ మాట్లాడటానికే వస్తున్నానని, లేదంటే మీరు వ్రాసి ఇస్తే చదువుతాను అని స్పీకర్ ను ఎదురు ప్రశ్నించారు. దీంతో స్పీకర్ అచ్చన్నాయుడు తనను ప్రశ్నించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు, మీరు ఇదేమైనా మార్కెట్ అనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ' మీరు చెప్పండి. నేనే చదువుతాను. ఏం మాట్లాడుతున్నారు.. ఇదేమైనా బజారు అనుకుంటున్నారా ' అంటూ.. స్పీకర్ మండిపడ్డారు. ఇలా వ్యవహరిస్తే సభ నడపడం చాలా కష్టమవుతుందని సీతారాం వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు సభ సంప్రదాయాలు మర్చిపోయారని, స్పీకర్ ను కూడా బెదిరించేలా వ్యవహరిస్తున్నారని వైసిపి సభ్యుడు శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు.
అచ్చెన్న విషయంలో చంద్రబాబుకు సూటిప్రశ్న వేసిన స్పీకర్ ... చంద్రబాబు ఎదురు ప్రశ్న
తాను ఏం మాట్లాడాలో మీరు రాసిస్తే, తాను చదువుతానంటూ స్పీకర్ ను ఉద్దేశించి టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళాన్ని సృష్టించాయి. అచ్చెన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ , అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? అంటూ చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. అయితే దానికి సమాధానం చెప్పిన చంద్రబాబు తాను సమర్థించననిపేర్కొన్నారు . ఇక చంద్రబాబు స్పీకర్ ను ఉద్దేశించి ప్రశ్నిస్తూ తనపై వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? అని స్పీకర్ ను చంద్రబాబు ప్రశ్నించారు.ఒకప్పుడు సభలో మాట్లాడటానికి ఎన్టీఆర్ కు కూడా చంద్రబాబు మైక్ ఇవ్వలేదని రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశించే స్పీకర్ ను చంద్రబాబు ప్రశ్నించారు. అయితే, స్పీకర్ ను చంద్రబాబు ప్రశ్నించడాన్ని అంబటి రాంబాబు తప్పుబట్టారు. సభలో అత్యంత సీనియర్ అయిన నాయకుడు అయిన స్పీకర్ ను ప్రశ్నించడం ఏమిటని మండిపడుతున్నారు అంబటి రాంబాబు . మొత్తానికి ప్రశ్నలు , ఎదురు ప్రశ్నలతో సభా పర్వం దద్దరిల్లుతోంది.