వైసీపీ ఎంపీల రాజీనామాలో ట్విస్ట్: ఏ నిర్ణయం తీసుకోకుండానే విదేశాలకు స్పీకర్
న్యూఢిల్లీ/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాపై సంధిగ్ధత ఏర్పడింది. ప్రత్యేక హోదా కోసం అయిదుగురు వైసీపీ ఎంపీలు రెండు నెలల క్రితం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారి రాజీనామా ఇటీవల వారు మరోసారి స్పీకర్ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమ రాజీనామాలు ఆమోం పొందినట్లేనని చెప్పారు.
స్పీకర్ తమను కన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వామని చెప్పారని, అది ఇచ్చాక ఆమోదిస్తారన్నారు. ఆ తర్వాత వారు వాటిని ఇచ్చారు. అయినప్పటికీ రాజీనామాలపై ఇంకా స్పష్టత లేదు. స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం వారి రాజీనామాలకు ఆమోదం తెలుపుతారని, అది అందరికీ చెబుతారని భావించారు. కానీ శుక్రవారం కూడా ఆమె నిర్ణయం తీసుకున్నట్లుగా లేదు.
మధ్యాహ్నం రెండు గంటలకు విదేశీ పర్యటనకు బయలుదేరే ముందు ఆమె వీటికి ఆమోదముద్ర వేయొచ్చని అంచనావేసినప్పటికీ, ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఆమె లాత్వియా, బెలారస్ పర్యటనకు వెళ్లారు. 18న తిరిగి వస్తారు. రాజీనామాలపై ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవచ్చన్న భావన వ్యక్తమవుతోంది.
కాగా, రాజీనామాల ఆమోదానికి ఆలస్యానికి గల కారణాలు తెలియలేదు. అది పూర్తిగా స్పీకర్ విచక్షణాధికారాల పరిధిలోకి వస్తుంది. కాబట్టి దాన్ని ఎవ్వరూ ప్రశ్నించడానికి వీల్లేదని అంటున్నారు. లోకసభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవ కూడా స్పీకర్తోపాటే పర్యటనకు బయలుదేరారు. దీంతో ఇద్దరూ తిరిగి వచ్చే వరకు రాజీనామాలపై తేలే అంశం లేదని అంటున్నారు.