40 ఏళ్ల అనుభవం ఇదేనా: ఆ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: చంద్రబాబు పై స్పీకర్..!
ఏపీ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన స్పీకర్ తమ్మినేని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంగ్లీషు మీడియం పాఠశాలల నిర్ణయం పైన ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన ముఖ్యమంత్రి విమర్శలు చేసారు. ఆ తరువాత చెవిరెడ్డి భాస్కర రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ అంశం పైన స్పందించిన ముఖ్యమంత్రి గురువారం దీని పైన చర్చ ఉందని.. ఇక దీనిని ముగించాలని కోరారు.
చంద్రబాబు పై స్పీకర్ సీరియస్: ప్రతిపక్ష నేత సస్పెన్షన్ కు డిమాండ్: అసెంబ్లీలో రగడ..!
అయితే, చంద్రబాబు మరోసారి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరుతూ..స్పీకర్ మీద చేసిన వ్యాఖ్యలతో స్పీకర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. చంద్రబాబు తనను బెదిరించేలా మాట్లాడటం సరి కాదని మండిపడ్డారు. వెంటనే వ్యాఖ్యలు ఉప సంహరించుకోవాలని సూచించారు. చంద్రబాబు సైతం గట్టిగా స్పందించారు. దీంతో..వైసీపీ నేతలంతా స్పీకర్ ను అగౌరపరిచిన చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. ఆ తరువాత స్పీకర్ ఈ విషయాన్ని చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు.
చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నా
సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు తన మీద చేసిన వ్యాఖ్యల మీద స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేసారు. తన మీద చేసిన వ్యాఖ్యల మీద ఒక్క సారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలిగించారు. దీనిని తప్పు బడుతూ వైసీపీ నేతలు చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని..ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. దీని మీద స్పీకర్ స్పందించారు. సభలోని సభ్యుల అభిప్రాయాల ను గౌరవిస్తూనే.. వ్యాఖ్యలు చేసిన వారి విజ్ఞతకే వ్యవహారాన్ని వదిలేస్తున్నానన వ్యాఖ్యానించారు. దీంతో..వైసీపీ సభ్యులు మరోసారి స్పీకర్ నిర్ణయానికి మద్దతుగా..ఆయన్ను ప్రశంసించారు.
స్పీకర్ వర్సెస్ చంద్రబాబు
దీంతో..మరోసారి మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఆ సమయంతో అవకాశం ఇవ్వకపోవటంతో స్పీకర్ ఛైర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసారు. దీంతో..ఒక్కసారిగా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబును మాట వెనక్కు తీసుకోవాలని సూచించారు. ఆ తరువాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలిగించారు. ఆ వెంటనే వైసీపీ సభ్యులు ఒక్క సారిగా సీరియస్ అయ్యారు. స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా..చంద్రబాబుతో సహా టీడీపీ సభ్యులు వాదనకు దిగారు. తమకు అవకాశం ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఆ సమయంలో స్పీకర్.. చంద్రబాబు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా గౌరవం నిలబెట్టుకోవాలని స్పీకర్ సూచించారు. చంద్రబాబు అంటే తనకు గౌరవం అని..ఇలా వ్యవహరిస్తే సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
చంద్రబాబును సస్పెండ్ చేయాలి..
చంద్రబాబు స్పీకర్ పైన చేసిన వ్యాఖ్యలతో సభలో రగడ మొదలైంది. దీంతో..వైసీపీ నుండి పలువురు సభ్యులు స్పందించారు. స్పీకర్ ఛైర్ మీద అనుచిత వ్యాఖ్యలతో అగౌరవంగా వ్యవహరించిన చంద్రబాబును సభ నుండి సస్పెండ్ చేయాలని అంబటి రాంబాబు..మంత్రి అనిల్ ,, మేరుగ నాగార్జునతో సహా జనసేన సభ్యుడు రాపాక వర ప్రసాద్..జోగి రమేష్ తో పాటుగా పలువురు సభ్యులు చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. బీసీ వర్గానికి చెందిన స్పీకర్ పైన అనుచితంగా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు పైన చర్యలు తీసుకున్న తరువాతనే సభ సాగాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేసారు. వైసీపీ సభ్యుడు అప్పలరాజు సైతం స్పందించారు. ఇది మానసిక జబ్బు అని.. వైద్యులకు చూపించాలని కోరారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని మంత్రులు డిమాండ్ చేసారు.