రెవెన్యూ అధికారులకు స్పీకర్ తమ్మినేని వార్నింగ్: ఆ భూములు వెనక్కు తీసుకోకపోతే తీవ్ర చర్యలు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారులపై ఫైర్ అయ్యారు. వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు . వారి మీద అందరి ముందు ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. పొందూరులో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన అంశాన్ని అధికారులు స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని చెప్పడానికా మీరున్నది అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు.
ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిలో అధికార పార్టీ నేతలున్నారన్న రెవెన్యూ అధికారులు
లబ్ధిదారులకు భూమి పట్టాల పంపిణీ కోసం స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములకు సంబంధించిన సమీక్ష కోసం ఆయన శనివారం రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిని ఖాళీ చేయించటం సాధ్యం కావటం లేదని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. వారిలో కొందరు అధికార పార్టీ అయిన వైసీపీ నాయకులు ఉన్నారని అందుకే రెవెన్యూ అధికారులు ఆక్రమణలను క్లియర్ చేయలేకపోయారని ఆరు స్పీకర్ కు చెప్పారు.
ఎవరైనా సరే ఖాళీ చేయించాలని అధికారులపై తమ్మినేని ఆగ్రహం
కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పుడు ఆక్రమణలను తొలగించడానికి ఎందుకు భయపడుతున్నారని సీతారాం రెవెన్యూ అధికారులను అడిగారు. ఎవరైనా సరే ఖాళీ చెయ్యాల్సిందేనని , ఇక వారికి తాను కూడా చెప్తానని అన్నారు . అన్ని ఆక్రమణలను వెంటనే క్లియర్ చేయాలని ఆయన స్పష్టం చేశారు. అవసరం అనుకుంటే పోలీసులను తీసుకెళ్ళి మరీ ఖాళీ చేయించి భూములను స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు.
Recommended Video
ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతుంటే అధికారులు ఏంచేస్తున్నారని ఫైర్
ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతుంటే అధికారులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా, ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటని నిలదీశారు. ఆక్రమణలకు గురైన భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే పోలీసుల సాయం తీసుకునైనా భూములను ప్రభుత్వ పరం చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలను ఎవరు కబ్జా చేసినా ఉపేక్షించవద్దని, వెంటనే ఖాళీ చేయించాలని అన్నారు. పొందూరులో రెవెన్యూ అధికారులతో సమావేశంలో తమ్మినేని వారిని ఖాళీ చేయించకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.