చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం- ఉడత ఊపులు, పిల్లి శాపనార్దాలకు భయపడనంటూ..
ఏపీ అసెంబ్లీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పోరు నానాటికీ ముదురుతోంది. ఇవాళ ఇళ్ల స్ధలాలపై జరుగుతున్న చర్చలో భాగంగా వైసీపీ నేతలు తమపై ఆరోపణలు చేయడాన్ని ఆక్షేపించిన విపక్ష నేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం అందుకు అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఏపీ అసెంబ్లీలో ఆన్లైన్ జూదం నియంత్రణ బిల్లు- ఎవరినీ వదిలిపెట్టబోమన్న జగన్
హౌసింగ్ అంశంపై చర్చ జరుగుతున్న సందర్భంగా మంత్రి నారాయణస్వామి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అంశాలను ప్రస్తావించారు. దీంతో టీడీపీ నేతలు దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ తమ్మినేనిని కోరారు. ఆయన అందుకు అనుమతించకుండా వైసీపీ సభ్యుడు వసంత కృష్ణప్రసాద్కు అవకాశం ఇచ్చారు. దీంతో స్పీకర్ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోడియంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు.
చంద్రబాబుతో పాటు ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు తనపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడంతో స్పీకర్ తమ్మినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఉడత ఊపులకు, పిల్లి శాపనార్ధాలకు భయపడబోనంటూ స్పీకర్ ఫైర్ అయ్యారు. తన వైపు వేలు చూపిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ మండిపడ్డారు. తనను ఎవరూ భయపెట్టలేరంటూ వెళ్లి సీట్లలో కూర్చోవాలంటూ ఆదేశించారు. దీంతో టీడీపీ సభ్యులు చేసేది లేక సీట్లలో కూర్చున్నారు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో పాటు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చంద్రబాబు తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు.
Recommended Video
అసెంబ్లీలో చంద్రబాబు తీరు దారుణంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, డిప్యూటీ సీఎం అంజాత్ బాషా ఆరోపించారు. బీసీలపై చంద్రబాబుకు కనీస గౌరవం లేదని, బీసీ సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ తమ్మినేనిని చంద్రబాబు బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారని అంబటి ఆరోపించారు. నిన్న సభలో మైనార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి చంద్రబాబు తీవ్ర దూషణలకు దిగారని, ఇవాళ ఏకంగా స్పీకర్పైనే వ్యాఖ్యలు చేస్తున్నారని అంజాత్ బాషా విమర్శించారు. చంద్రబాబు బీసీలు, మైనార్టీలను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు.