ఇదేం పద్దతి...? స్పీకర్ గౌరవాన్ని కాపాడండి... తమ్మినేనికి, యనమల హితవు
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విమర్శించడంపై ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడడం సరైంది కాదని అన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్నవారు ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నేతలను సమాన దృష్టితో చూడాలని ఆయన హితవు పలికారు.. స్పీకర్లు రాజకీయాలు మాట్లాడడం వల్ల వారి స్థాయి దిగజారుతుందని అన్నారు. వ్యక్తిగత విమర్శలకు తావు ఇవ్వకుండా స్పీకర్ స్థానంలో ఉన్నవారు వ్యవహరించాలని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్దికి అధికారపక్షంతోపాటు ప్రతిపక్షం కూడ అంతే ముఖ్యమని ఆయన వెల్లడించారు.
రాజధానిపై ఏపీ స్పీకర్ తమ్మినేని స్పందన .. కానీ ఇంత రచ్చ జరుగుతున్నా సీఎం జగన్ స్పందించరేం ?
కాగా అగ్రిగోల్డ్ బాధితులకు జరిగిన అన్యాయం స్పందించిన స్పీకర్ తమ్మినేని శుక్రవారం వివాస్పద వ్యాఖ్యలు చేశారు. నేరుగా ప్రతిపక్ష నేత చంద్రబాబును ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాలే స్కాంలకు ఎగబడితే ప్రజలను ఎవరు రక్షిస్తారని ఆయన అన్నారు. ఇక అగ్రిగోల్డ్ విషయంలో చంద్రబాబుకు సంబంధం లేదని ప్రకటించగలరా అంటూ ఆయన ప్రశ్నించారు. హయ్ల్యాండ్ భూములను కాజేసేందుకు చంద్రబాబుతోపాటు, లోకేష్, యనమల రామకృష్ణుడు, మరియు సీఎం రమేష్లు కుట్ర పన్నారని ఆరోపణలు చేశారు.
ఇక కళ్లముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు... కాగా తాను ముందు ఒక ఎమ్మెల్యేనని ఆ తర్వాతే స్పీకర్నని అన్నారు. రాజకీయాల్లో తనకెంతో అనుభవం ఉందని..చంద్రబాబు గుడ్డలు ఊడదీసీ దీసీ ప్రజల ముందు నిలబెడతామని అన్నారు.