పోలవరం ప్రాజెక్టు చూద్దురు రారండి!...ప్రజలకు ఎపి ప్రభుత్వం ఆహ్వానం
కర్నూలు:సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పనితీరు, వాటి అవశ్యకతలపై ప్రజలకు అవగాహన పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా ప్రభుత్వం గుర్తించిన "పోలవరం"ను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన రైతులు, సాగునీటి సంఘాల నాయకులు, ఇంజినీరింగ్ విద్యార్థులు సందర్శించేందుకు ప్రభుత్వమే ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లా నుంచి రోజూ ఒక బస్సులో విద్యార్థులు, రైతులు పోలవరం పర్యటనకు వెళ్లేలా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు ఇందుకోసం ప్రత్యేకించి ప్రతి జిల్లాకు రూ.1.73 కోట్లు నిధులు కూడా కేటాయించింది
ఈ విధంగా పోలవరం సందర్శనకు రైతులు,విద్యార్థులను తీసుకెళ్లే విషయంపై అవగాహన కల్పించేందుకు అన్ని జిల్లాల సర్కిల్ కార్యాలయాల ఎస్ఈలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి వరుసగా మూడు నెలలపాటు పోలవరం ప్రాజెక్టును సందర్శించే అవకాశం కల్పించడంతో పాటు ప్రాజెక్టుల పనితీరుపై పూర్తి అవగాహన పెంచుకోవడంకు ఈ చర్య ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు.
అందుకోసమే అన్ని జిల్లాలకు ఈ పర్యటనల ఏర్పాట్ల నిమిత్తం తొలి విడతగా రూ.22.25 కోట్లను శుక్రవారం విడుదల చేసింది. ఒక్కో జిల్లాకు రూ.1.73 కోట్ల ప్రకారం ప్రకారం కేటాయించింది. ఈ నిధులు ఆయా సర్కిల్ ఎస్ఈల పరిధిలో ఉంటాయి. ప్రతిరోజు రు.55 వేలకు మించకుండా వ్యయం చేయాలని జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తొలి పర్యటనకు కర్నూలు జిల్లా వాసులు ఈనెల 22 న పోలవరం సందర్శించినట్లు తెలిసింది. జిల్లాలో ప్రతి రోజు ఒక్కో మండలం నుంచి బస్సులో 45 మంది రైతులను, సాగునీటి సంఘాల అధ్యక్షులను తీసుకెళ్తున్నారు. వీరి వెంట ఒక ఏఈఈ కూడా ఉంటారు. జిల్లాలోని 53 మండలాల నుంచి పోలవరానికి పంపుతున్నామని అధికారులు చెబుతున్నారు...ఈ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్ల భారమంతా కర్నూలు సర్కిల్ ఎస్ఈపై వేయడం గమనార్హం.
కర్నూలు జిల్లా 53 మండలాల్లో 41 మండలాల నుంచి కర్నూలు సర్కిల్ ఎస్ఈ, 12 మండలాల నుంచి టీజీపీ, ఎస్సార్బీసీ సర్కిల్ ఎస్ఈలు రైతులను పోలవరం సందర్శించేలా తగిన చర్యలు చేపట్టాలని కర్నూలు సీఈ శుక్రవారం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.