ఏపీ ప్రజల కోసం ప్రత్యేక బ్యాంకులు కూడా... వైసీపీ సర్కార్ 'మీ బ్యాంక్' ప్లాన్
ఏపీలోని వైసిపి ప్రభుత్వం సరికొత్త పథకాలతో,సరికొత్త ప్రయోగాలతో పాలనలో తన మార్కు చూపించాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మరో వినూత్న ఆలోచన చేస్తోంది ఏపీ సర్కార్. ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతాలు, పెన్షన్లు, ప్రజలకు సంక్షేమ పథకాలు, సామాజిక పెన్షన్లు ఇవ్వడానికి వివిధ బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరుపుతోంది ప్రభుత్వం. ఇక వీటిని ఇవ్వటానికి స్వయంగా బ్యాంకును ఏర్పాటు చేయాలని భావిస్తుంది.
రివర్స్ లో వెళ్ళినా లాభమే అంటున్న ఏపీ సర్కార్ .... సక్సెస్ అయిన మరో రివర్స్ టెండరింగ్
ప్రతినెల ప్రభుత్వ చెల్లింపులు రెండు వేల కోట్ల రూపాయలు
ప్రభుత్వం దాదాపు ప్రతి నెల రెండు వేల కోట్ల రూపాయలను చెల్లింపులను లబ్ధిదారులకు చెల్లింపు చేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆంధ్ర బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు ట్రెజరీ నుండి ఈ లావాదేవీలు దొరుకుతుంది. ఖాతాదారులు సదరు బ్యాంకుల నుండి ఈ డబ్బులు డ్రా చేసుకుంటారు. ఇక ఈ క్రమంలో వైసిపి ప్రభుత్వం దీనికి స్వస్తి చెప్పి సొంతంగా బ్యాంకును ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉంది.
'మీ బ్యాంక్' పేరుతో ఏపీ ప్రభుత్వ బ్యాంక్
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక బ్యాంకును ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్న ఏపీ సర్కార్ 'మీ బ్యాంక్' పేరుతో దానికి శ్రీకారం చుట్టాలని భావిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వంపై సొంత బ్యాంకును ఏర్పాటు చేయాలని అనుకోవడానికి పలు కారణాలున్నాయి. సహజంగా ఉద్యోగులు తమ ఖాతాలో జమ అయిన డబ్బులను,మొత్తాన్ని ఒకేసారి విత్ డ్రా చేసుకోరు. ఉద్యోగులు తమ అవసరాల మేరకు డబ్బును డ్రా చేస్తుంటారు.
'మీ బ్యాంక్' ఏర్పాటుకు వెనుక ఉన్న కారణాలివే
ఇతర బ్యాంకుల ద్వారా వేతనాలు చెల్లించడం వల్ల ఉద్యోగులు తమ ఖాతాల్లో ఉంచిన డబ్బు ఆయా బ్యాంకులకు సంబంధించిన నగదుగా ఉండిపోతుంది తప్ప ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు అందుకే ఉద్యోగులు తమ అవసరాలకు విత్ డ్రా చేసుకున్న సొమ్ము కాకుండా, మిగతా సొమ్ము ప్రభుత్వం ఏర్పాటు చేసే 'మీ బ్యాంక్' ద్వారా నగదు లావాదేవీలు జరిగితే అందులోనే ఉండిపోతుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యే అవకాశం ఉండదు. అదేవిధంగా లబ్ధిదారులకు చెల్లించాల్సిన సొమ్ము కూడా చెల్లించినట్లు ఉంటుంది అని భావిస్తోంది ఏపీ సర్కార్.
కేరళలో సక్సెస్ అయిన ట్రెజరీ బ్యాంకు... ఏపీలో సక్సెస్ అవుతుందంటున్న 'మీ బ్యాంక్ '
ఇక ఈ ఆలోచనతోనే గ్రీన్ ఛానల్ పీడీ తరహాలో 'మీ బ్యాంకు' ను ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ ఆలోచిస్తోంది అని సమాచారం. ఉద్యోగుల వేతనాలు,పెన్షన్, అలాగే సంక్షేమ పథకాలు, సామాజిక పింఛన్లు అన్ని మీ బ్యాంకు ద్వారా ప్రజలకు అందించడంతోపాటు, నగదు విత్ డ్రా చేసుకోవడానికి కూడా ఒక లిమిట్ పెట్టాలని భావిస్తోంది సర్కార్. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఈ తరహాలో ప్రారంభించిన కేరళ ట్రెజరీ బ్యాంక్ సక్సెస్ అయింది. ఇక ఇదే కోవలో ఏపీలో ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన 'మీ బ్యాంకు' కూడా సక్సెస్ అవుతుందనే భావన వ్యక్తమవుతోంది.