ఏపీలో శివాజీ హైలెట్: 'చిరు' ప్రయత్నం, జగన్ మౌనం వెనుక..?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ నటుడు శివాజీ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాడు. గుంటూరులో శివాజీ ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్నాడు. దీక్షలో అతను బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని దనుమాడుతున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ను నిలదీస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం బీజేపీ ఇచ్చిన మాట తప్పుతోందని విపక్షాలు కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా దీనిపై అసంతృప్తితో ఉంది. అయితే, వీరందరి కంటే ప్రత్యేక హోదా విషయంలో శివాజీ హైలెట్ అయ్యారు. అందుకు ఆయన ప్రత్యేక హోదా పైన గత కొన్నాళ్లుగా తీవ్రస్థాయిలో గళమెత్తడమే కారణమని చెప్పవచ్చు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా బీజేపీ స్పష్టత ఇచ్చిందనే చెప్పవచ్చు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నప్పటికీ.. అది ఎప్పుడు ఇస్తామో చెప్పలేమని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో పొత్తును భగ్నం చేసుకోవడానికి ఇష్టపడని టీడీపీ ఇరకాటంలో పడింది.
అయితే, ప్రత్యేక హోదా అంశంతో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు అనుకున్నంత బాగా స్పందించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. తాము ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని చెప్పింది. అయితే, అది ఎంత వరకు, ఎలా అవుతుందో చూడాలి. అడపాదడపా ప్రకటనలు చేస్తున్నారు. అంతకుమించి హంగామా లేదని చెబుతున్నారు.
అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో అంతగా స్పందించడం లేదని అంటున్నారు. వారు ఎందుకు ఘాటుగా స్పందించడం లేదో అర్థం కావడం లేదని అంటున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం జగన్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలను కలిసిన విషయం తెలిసిందే. అప్పుడు టీడీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో లాలూచీ కోసమే జగన్ వెళ్లారని ఆరోపించారు.