ఆందోళనలో ఎంసెట్ రాసిన విద్యార్ధులు: 'సీఎం ఢిల్లీకి వెళ్లినప్పుడు నీట్పై చర్చిస్తారు'
విశాఖపట్నం: నీట్ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏపీలో ఎంసెట్ రాసిన విద్యార్ధులు ఆందోళనకు గురవుతున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాదికి ఏపీను నీట్ నుంచి మినహాయించాలని సుప్రీం కోర్టులో మరో పిటిషన్ వేయనున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినప్పుడు నీట్పై చర్చిస్తారని ఆయన తెలిపారు. అదే విధంగా ఎంసెట్ (మెడిసిన్) ఫలితాల విడుదలపై త్వరలోనే వివరణ ఇస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి నీట్కు అనుగుణంగా సిలబస్ రూపొందిస్తామన్నారు.
కాగా విజయవాడలో ఉన్నత విద్యా దీపం పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. దీంతో పాటు డీఎస్సీలో కూచిపూడి కోసం ప్రత్యేక పోస్టులు క్రియేట్ చేసి భర్తీ చేస్తామని ఆయన అన్నారు.
ఈ పోస్టులను భర్తీ చేసే ముందు మంజుభార్గవి లాంటి కళాకారులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రతి ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం కూచిపూడి నృత్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా తెలిపారు.
ఈ సందర్భంగా ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి మంజుభార్గవి మాట్లాడుతూ.. కూచిపూడి వర్క్షాపు నిర్వహించాలంటే కనీసం నెలరోజులైనా సమయం ఉండాలని అన్నారు. కూచిపూడి కళాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోడుగా నిలవాలని ఈ సందర్భంగా మంజుభార్గవి కోరారు.