పవన్ కళ్యాణ్! నీతో సాధ్యం, ఇక రా: ఆత్మహత్యాయత్నంపై శివాజీ, వెంకయ్యను ఏకేశారు
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే పెద్ద నాయకుడి పైన తాను ఆత్మహుతి దాడి చేస్తానని సినీ నటుడు శివాజీ శనివారం విజయవాడలో హెచ్చరించారు. తిరుపతిలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించడంపై ఆయన స్పందించారు.
ఆయన రాష్ట్ర యువతకు సంయమనం పాటించాలని సూచించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని దానిని పోరాడి సాధించుకుందామన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్టీలకు అతీతంగా అందరు కలిసి రావాలన్నారు. హోదా కోరుతూ ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామన్నారు.
కాంగ్రెస్, బిజెపి నాటకాలు ఆడుతున్నాయన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇకనైనా మేల్కొనాలన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి పోరాడాలని సూచించారు. ఆత్మహత్యాయత్నం ఘటనతో అయినా పవన్ మేల్కొనాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందేనని చెప్పారు.
రాజకీయ స్వలాభాల కోసం బీజేపీ ప్రత్యేక హోదాపై ఇవ్వడంపై శ్రద్ధ చూపట్లేదని, సీఎం చంద్రబాబు ఇకనైనా బీజేపీకి భయపడకుండా ప్రత్యేక హోదాపై దృష్టి పెట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఏపీలో మొగుడై కూర్చుంటాడనే బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వట్లేదన్నారు.
తమకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు అక్కర్లేదని తప్పకుండా ప్రత్యేక హోదా కావాలన్నారు. హోదా కోసం ఆత్మహత్యాయత్నం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలకు ఎవరూ పాల్పొడద్దని కోరారు. హోదాను పోరాటం ద్వారా సాధించుకుందామన్నారు. రాబోయే తరాల కోసం ప్రత్యేక హోదా కావాలన్నారు.
ప్రత్యేక హోదా చారిత్రక అవసరమని, నేతలు కళ్లు తెరవాలన్నారు. తమకు ప్రత్యేక ప్యాకేజీ వద్దని, హోదా మాత్రమే కావాలని తేల్చి చెప్పారు. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడికి ఏమైనా జరిగితే, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఇంతమంది ఎంపీలుండి ఏం ప్రయోజనమన్నారు. అందరూ కలసి ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పైనానిప్పులు చెరిగారు. 68 ఏళ్లు దాటాయని, ఇంకా ఎందుకు సార్, మీకు పదవి పైన ప్రేమ.. పదవిలో ఉండి ఏం సాధిస్తారు సార్? అంటూ నిలదీశారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా ప్రత్యేక హోదాపై ఏమీ చేయకుండా మౌనంగా ఎందుకున్నారన్నారు.