కేవీపీ బిల్లు, బీజేపీXటీడీపీ: జైట్లీ ఏం చెప్తారు, బాబును కార్నర్ చేసేనా?
ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టం అమలు పైన రాజ్యసభలో గురువారం నాడు మధ్యాహ్నం చర్చ జరగనుంది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు బిల్లు నేపథ్యంలో చట్టం అమలు, హామీల అమలుపై చర్చ జరగనుంది.
వీటిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇవ్వనున్నారు. కేవీపీ బిల్లు, రాజ్యసభ ప్రతిష్టంభన నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నిర్వహించిన అఖిల పక్షంలో గురువారం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం చర్చ ప్రారంభమవుతుంది.
ఈ చర్చలో జైట్లీ ఏం చెబుతారు? టిడిపి వ్యూహం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? అనే చర్చ సాగుతోంది. అంతకుముందు, కేవీపీ బిల్లు ద్రవ్య బిల్లు కిందకు వస్తుందని జైట్లీ ట్విస్ట్ ఇవ్వడం, దానిపై లోకసభ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ కూడా మెత్తబడినట్లుగా వార్తలు వచ్చాయి.
అదే సమయంలో, ఏపీ ప్రజల విషయంలో తాము దోషులుగా ఉండకుండా, వారిలో అపోహలు తొలగించేందుకు బీజేపీ కూడా చర్చకు సిద్ధపడి... ఈ రెండేళ్లలో తాము ఏపీకి ఏం చేశాం, ఇంకా ఏం చేస్తాం అనే విషయాలను పూర్తిగా సభ ముందు పెట్టనుందని తెలుస్తోంది. తద్వారా, తమను ఇరుకున పెట్టాలని చూసిన కాంగ్రెస్ పార్టీని, సెంటిమెంట్ పేరుతో తమపై పైచేయి సాధించాలని చూసిన చంద్రబాబు ప్లాన్కు కౌంటర్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.
నిధులపై బీజేపీ వర్సెస్ టిడిపి అవుతుందా?
హోదా పైన చర్చకు సంబంధించి బీజేపీ, టిడిపిలు విడతలవారిగా మంగళవారం నాడు చర్చలు జరిపారు. ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చిన నిధులు తదితరాల పైన ఏపీలో బీజేపీ వర్సెస్ టీడీపీగా ఉంది. వీటి విషయంలో వాగ్యుద్ధం కూడా కనిపించింది. ఇప్పుడు నిధులు, హామీల పైన అన్ని లెక్కలు చెప్పి టిడిపిని ఇరుకున పెడుతుందా లేక తానే ఇరుక్కుంటుందా చూడాల్సి ఉంది.
ఏదేమైనా నష్టం మాత్రం మిత్రపక్షాలైన బీజేపీ, టిడిపిలలో ఏదో ఒకదానికి మాత్రమేనని, కాంగ్రెస్, వైసిపి సేఫ్ అని చెబుతున్నాయి. బిల్లు పెట్టడం ద్వారా కాంగ్రెస్, మద్దతిస్తామని చెప్పడం ద్వారా జగన్ సేఫ్ అని చెబుతున్నారు.