అలా చేస్తే ప్రత్యేకహోదా ఆనాడే వచ్చేది: బాబుపై విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు
విశాఖపట్టణం: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా విషయంలో దొంగ నాటకాలు ఆడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ప్రజల నుండి దోచుకొన్న డబ్బును హవాల రూపంలో విదేశాలకు తరలించారని ఆయన ఆరోపణలు చేశారు.
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో టిడిపి చేసిన అన్యాయాలను వివరిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో విశాఖపట్టణంలో వంచన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో వైసీపీకి చెందిన ఎంపీలు, పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈ సభలో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు.ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిల్లిమొగ్గలు వేశారని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదాను ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు నీరుగార్చారని ఆయన చెప్పారు. ప్రజల సొమ్ముతో టిడిపి నేతలు కూడ విలాసాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల నుండి దోచుకొన్న సొమ్మును చంద్రబాబునాయుడు హవాలా రూపంలో విదేశాలకు తరలించారు.
సింగపూర్లో ఆస్తులు కూడబెట్టారని చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఆరోపించారు. టిడిపి చేసేది ధర్మపోరాటం కాదన్నారు. ధర్మపోరాటం అంటే టిడిపికి తెలుసా అంటూ ఆయన చురకలు అంటించారు. టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ద్వంద్వ ప్రమాణాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.ప్రత్యేక హోదా ఇస్తేనే సీఎంగా ప్రమాణం చేస్తానని చంద్రబాబునాయుడు చెబితే ఆనాడే ప్రత్యేక హోదా దక్కేదన్నారు.