రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదాపై వాడీవేడి చర్చ: ఎవరేమన్నారంటే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరిగింది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేవీపీ మాట్లాడుతూ.. దేశంలో ప్రత్యేక హోదా కొనసాగించాల్సిందేనని అన్నారు. ఆర్థక సంఘం సభ్యులు కూడా ఇదే చెప్పారని అన్నారు.
కేంద్రం ప్రభుత్వం పార్లమెంటులో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పారు. హోదా ఇవ్వవద్దని, రాష్ట్రాలకు హోదాను పూర్తిగా తొలగిస్తామని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ చెప్పారని తెలిపారు. తెలంగాణకు రాజధాని వెళ్లిపోయిందని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు.
విభజనకు హామీ ఇస్తూ..
రాష్ట్ర విభజన సమయంలో వెంకయ్యనాయుడు రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారని సీపీఐ ఎంపీ డీ రాజా తెలిపారు. వెంకయ్య, అరుణ్ జైట్లీలు అడగడం వల్లే అప్పటి ప్రధాని ఏపీకి హోదా ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. 11 రాష్ట్రాలకు హోదా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజనకు మద్దతిస్తూనే తాము ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేశామని డీ రాజా తెలిపారు. కేంద్రం ఇచ్చిన హామీలు కొనసాగుతాయో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
హోదాపై ఎందుకిలా?
రాజ్యసభలో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారని జైరాం రమేష్ గుర్తు చేశారు. అప్పటి ప్రధాని ఐదేళ్లు ఇస్తామంటే.. పదేళ్లు కావాలని వెంకయ్య డిమాండ్ చేశారని అన్నారు. అంతేగాక, ఇది ప్రజల డిమాండ్ అని వెంకయ్య చెప్పారని అన్నారు. అప్పటి ప్రధాని అమల్లోకి తెచ్చిన ఆధార్, జీఎస్టీలను కొనసాగిస్తున్న ప్రధాని మోడీ.. ఏపీకి హోదా ఇచ్చే హామీని ఎందుకు కొనసాగించడం లేదని ప్రశ్నించారు.
ఏపీకీ హోదా ఇవ్వాల్సిందే..
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని టీడీపీ తెలంగాణ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. హోదా కోసం ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే, తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఏపీకి న్యాయం చేయడం లేదు
14వ ఆర్థిక సంఘం హోదాను ఇవ్వవద్దని ఎప్పుడూ చెప్పలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. అప్పటి ప్రధాని హోదా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీకి ఆదాయం తక్కువగా ఉందని అన్నారు. ఆర్థిక సంఘం పేరుతో ఏపీకి న్యాయం చేయడం లేదని కేంద్రంపై మండిపడ్డారు.
ఇబ్బంది ఎందుకు?
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోయిందని, రాజధాని లేని ఏపీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఎంపీ సుబ్బిరామిరెడ్డి అన్నారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఏపీకి హోదా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. హోదా ఇచ్చేందుకు కేంద్రం ఎందుకు ఇబ్బంది పడుతుందో చెప్పాలని నిలదీశారు.
తిరుపతి సాక్షిగా చెప్పారు..
ఎన్నికల సమయంలో ఏప్రిల్ 24న తిరుపతిలో జరిగిన సభలో నరేంద్ర మోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు ఏపీకి ప్రత్యేక అవసరమని అన్నారని కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. అప్పుడు హోదా కావాలని డిమాండ్ చేసి.. ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జైట్లీ హోదా విషయంలో తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.
రాష్ట్రాలకు హోదా ఉండాల్సిందే..
దేశంలోని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉండాల్సిందేనని ఎంపీ కేకే అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వవద్దని ఆర్తిక సంఘం చెప్పలేదని అన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక వసతులు రాస్ట్రాలకు అవసరమని అన్నారు.
హోదా ఇవ్వాల్సిందే..
ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఏపీని హోదాతో ఆదుకోవాలని అన్నారు. జమ్మూకాశ్మీర్ తోపాటు ఇతర రాష్ట్రాల్లాగే ఏపీకి ఆదాయం తక్కువగా ఉందని చెప్పారు.ఎన్డీఏ వచ్చాక ప్రత్యేక సాయాన్ని నిలిపివేసిందన్నారు. ఎన్డీసీ మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
హోదాకు మద్దతు
ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో తాము మద్దతిస్తున్నట్లు ఎస్పీ ఎంపీ నరేష్ అగర్వాల్ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని ఆయన అన్నారు.