జగన్ కు ఢిల్లీలో ఇంటర్వ్యూలు ఇవ్వటం లేదా: కేసీఆర్ తో సంబంధాలపైనా: హోదా రగడ..!
ఏపీకి ప్రత్యేక హోదా..విభజన అంశాలు..తెలంగాణతో సంబంధాల పైన అసెంబ్లీలో హాట్ చర్చ సాగింది. టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం ఢిల్లీ వెళ్తున్నారు..వస్తున్నారు..అక్కడ ఇంటర్వ్యూలు లభించటం లేదా అని నిలదీసారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చల ఫలితంగా 68 విభజన అంశాల్లో పరిష్కారం లభించిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వం హోదా కోసం నిలబడి ఉంటే ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని..ప్యాకేజికి అంగీకరించటం వలనే హోదా రాలేదని అధికార పక్షం ఫైర్ అయింది. ఓటు కు నోటు కారణం గా హైదరాబాద్ వదిలి వచేసారంటూ చంద్రబాబు పైన వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. అయితే, తాము హోదా సాధించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
68 అంశాల్లో కేసీఆర్ సానుకూలంగా..
అసెంబ్లీలో విభజన అంశాలు..హోదా పైన జరిగిన చర్చలో మంత్రి కన్నబాబు సమాధానం ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సత్సంబంధాల కారణంగా 9, 10 వ షెడ్యూల్ ల్లోని 68 విభజన అంశాల్లో తెలంగాన ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించిందని చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వ నాడు ప్యాకేజీకి ఒప్పుకోకుండా హోదా కోసం పట్టుబడి ఉంటే ఖచ్చితంగా హోదా వచ్చేదన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి..దీక్ష చేస్తే టీడీపీ ఎంపీలు మద్దతివ్వలేదని చెప్పుకొచ్చారు. విభజన చట్టం పరిధిలోకి వచ్చే ఏ ఒక్క భవనం తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వలేదని మంత్రి స్పష్టం చేసారు. అదే విధంగా టీడీపీ హాయంలో తెలంగాణ ప్రభుత్వం అక్కడి ఏపీ భవనాలను ఆక్రమించుకుంటుంటే నాడు ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. మరో అయిదేళ్లు కష్టపడితే కానీ..ఈ సమస్యలు పరిష్కారం కావని మంత్రి వివరించారు. మోదీ పైనా రోజుకో రకంగా మాట్లాడిన టీడీపీ..నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపి తిరిగి వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
జగన్ కు ఇంటర్వ్యూలు ఇవ్వటం లేదా..
తమకు 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే..హోదా తెస్తామంటూ నాడు జగన్ ఇచ్చిన హామీ ఏమైందని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అసలు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారు..వస్తున్నారు అక్కడ ఆయనకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ తో అనేక దఫాలు సమావేశమైన సీఎం జగన్ ఏపికి ఏం సాధించారని నిలదీసారు. ఏకపక్షంగా ఏపీకి చెందిన భవనాలను అప్పగించారని.. ఒక్క రూపాయి అయినా తెలంగాణ నుండి వచ్చిందా.. అక్కడి నుండి బకాయిలు వసూలు చేసారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం లభించలేదన్నారు. 22 మంది ఎంపీలు ఉన్న జగన్ ఇప్పుడు ఎందుకు ఒత్తిడి చేయటం లేదో చెప్పాలన్నారు. బీజేపీతో సంబంధాలు కోరుకుంటున్నారని..ఇంకా టీడీపీనే విమర్శిస్తూ ఉంటే జనం సహించరని అచ్చెన్న హెచ్చరించారు.
కేంద్రం పైన అవిశ్వాసం పెట్టింది జగన్..
ఏపీ ప్రయోజనాల కోసం పార్లమెంట్ తొలి సారిగా మోదీ ప్రభుత్వం పైన అవిశ్వాసం పెట్టింది వైసీపీ అని ఎమ్మెల్యే జోగి రమేష్ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం డబ్బులిస్తూ..ఆడియో టేపుల్లో దొరికిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. మోదీ విషయంలో చంద్రబాబు పిల్లి మొగ్గలు వేసారని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేసారు. అయిదు కోట్ల మంది పరువును చంద్రబాబు తీసారని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక, చంద్రబాబు ఏం చేసినా ప్రధాని మోదీ..అమిత్ షా దగ్గరకు రానీయటం లేదని..అందుకే నలుగురు ఎంపీలను ఆ పార్టీలోకి పంపారని ఆరోపించారు. వారి ద్వారా బీజేపీ దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.