హైద్రాబాద్ లేక ఏపీకి ఇబ్బంది: ఆజాద్, ప్రతి పైసా ఇస్తాం: జైట్లీ, ఊగిపోయిన సీఎం
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా విషయమై రాజ్యసభలో మంగళవారం నాడు వాడిగా వేడిగా చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని హోదా విషయమై నిలదీశారు. విభజనలో హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిందని, అలాంటి రాజధాని లేకపోవడంతో ఏపీ ఇబ్బంది పడుతోందన్నారు.
గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ... రెండేళ్ల క్రితమే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందన్నారు. తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. రాజధాని హైదరాబాదుకు వెళ్లడంతో ఏపీకి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ఏపీకి ఐదేళ్ల పాటు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ప్రకటించారని చెప్పారు.
వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామని కూడా ప్రకటించారన్నారు. విభజన జరిగి రెండేళ్లయినా హామీలు నెరవేరలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కూడా సహకరిస్తామని నాటి ప్రభుత్వం తెలిపిందన్నారు. రాజ్యసభ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి పలు హామీలు ఇచ్చారన్నారు.
అందులో ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ఉందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు అని నాటి ప్రధాని అంటే, వెంకయ్య నాయుడు పదేళ్లు అని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా పైన ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పడిందన్నారు.
ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని కోరిన వెంకయ్య నాయుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. నాడు ప్రత్యేక హోదాకు డిమాండ్ చేసిన బిజెపి ఆ హామీని నిలబెట్టుకోవాలన్నారు. హైదరాబాద్ లేకపోవడంతో ఏపీకి భారీగా నష్టం ఉందన్నారు. నాడు ఐదేళ్లని చెప్పిన వారు ఇప్పుడు ఒక్క ఏడాది కూడా హోదా ఇవ్వలేదన్నారు.
రాజధాని విషయంలోను అన్యాయం: కెవిపి
సభ సాక్షిగా నాడు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని కెవిపి రామచంద్ర రావు డిమాండ్ చేశారు. ఏపీకి కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందడం లేదన్నారు. ఏపీకి రాజధాని విషయంలోను అన్యాయం జరిగిందన్నారు. హామీల అమలుకు అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలన్నారు.
హామీలు కేవలం ఏపీకి సంబంధించిన విషయమే కాదని, సభా గౌరవానికి సంబంధించిన విషయాలు అన్నారు. రాజధాని లేక, రెవెన్యూ లోటుతో ఏపీకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయన్నారు. నాటి ప్రధాని ఇచ్చిన హామీకి నేటి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యక్ష సాక్షి అన్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
పోడియం వద్దకు దూసుకొచ్చిన కాంగ్రెస్ సభ్యులు
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చారు. వెంటనే ప్రత్యేక హోదాను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఊగిపోయిన సీఎం రమేష్
కాంగ్రెస్ పార్టీకి గత సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్ డిపాజిట్ కూడా రాలేదని సీఎం రమేష్ రాజ్యసభలో ఊగిపోయారు. వారు రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదా అంశాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం పాకులాడటం విడ్డూరమన్నారు.ఏపీకి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. విభజన జరిగిన తీరుపై ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు వివరించారన్నారు. పలుమార్లు ప్రధాని దృష్టికి ఏపీ సీఎం సమస్యలు తీసుకెళ్లారని చెప్పారు.
ప్రతీ పైసా చెల్లిస్తాం: జైట్లీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో మంగళవారం నాడు చెప్పారు. ఏపీకి సాయం చేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. రెవెన్యూ లోటుకు సంబంధించిన ప్రతి పైసా చెల్లిస్తామన్నారు.
ఏపీకి ఇప్పటికే కొంత సాయాన్ని అందించామని చెప్పారు. గత బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించామని చెప్పారు. విడతల వారీగా ఏపీకి సాయం అందిస్తామని చెప్పారు. ఇప్పటికే పలు శంకుస్థాపనలు జరిగాయని చెప్పారు. బడ్జెట్ పైన చర్చలో పోలవరంపై మరింత స్పష్టత ఇస్తామని చెప్పారు.రాజధాని నిర్మాణానికి ఇప్పటికే కొన్ని నిధులు మంజూరు చేశామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆర్థిక సంఘం అధ్యయనం చేస్తోందన్నారు.
అంతకుముందు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. రెండేళ్ల క్రితమే ఏపీ విభజన జరిగిందని, ఇప్పటి వరకు ప్రత్యేక హోదా హామీ అమలు కాలేదన్నారు. వెంకయ్య నాయుడు పదేళ్లు హోదా కావాలని చెప్పారని, ఇప్పుడు ఎందుకివ్వడం లేదన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా వెంటనే అమలు చేయాలని, దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చారు. దీనిపై రాజ్యసభ చైర్మన్ కురియన్ మండిపడ్డారు. సభలో ఇలాగే ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని కురియన్ హెచ్చరించారు. గందరగోళం మధ్య సభను వాయిదా వేశారు.