రాజ్యసభలో గందరగోళం, కేవీపీకి బిజెపి షాక్: బాబుపై చిరు ఆసక్తికర వ్యాఖ్య
న్యూఢిల్లీ: శుక్రవారం ఉదయం వాయిదా పడిన రాజ్యసభ, తిరిగి మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమైంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా ప్రయివేటు బిల్లు పైన చర్చ పెట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారిని చైర్మన్ కురియన్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
బిల్లు పైన ఎట్టి పరిస్థితుల్లోను చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. లెఫ్ట్ పార్టీ నేత సీతారాం ఏచూరి మాట్లాడుతూ... బీజేపీ సభ్యుడి హక్కును కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల ఆందోళనతో రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది.
హైకమాండ్ ఆదేశం: అన్నీ పక్కన పెట్టి సభకు చిరంజీవి
రాజ్యసభ చైర్మన్ ఎంత చెప్పినా విపక్షాలు వినలేదు. మరోవైపు, బీజేపీ సభ్యులు.. పార్లమెంటులో వీడియో తీసిన ఏఏపీ సభ్యుడి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యవహారం తేల్చాలని నినాదాలు చేశారు. పోడియం వద్దకు దూసుకు వచ్చారు. దీంతో, సభలో తీవ్ర గందరగోళం ఏర్పడటంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. తద్వారా, బీజేపీ బిల్లు పైన అనుకున్నది సాధించారని చెబుతున్నారు.
బాబు పరిస్థితిపై చిరు ఆసక్తికర వ్యాఖ్య
ప్రత్యేక హోదాపై తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా ఉందని చిరంజీవి శుక్రవారం నాడు అన్నారు. కేవీపీ బిల్లు ఎప్పటికైనా ఓటింగుకు రావాల్సిందేనని వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లుకు బీజేపీ వ్యతిరేకంగా ఓటు వేస్తే ఏపీలో ఆ పార్టీ మనుగడ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. బిల్లును అడ్డుకోవడానికి బీజేపీ అనేక వంకలు పెడుతోందన్నారు. ఏపీలో బీజేపీ బతికి బట్ట కట్టాలంటే మద్దతివ్వాల్సిందే అన్నారు.
మోడీని ఇరకాటంలో పడేసిన కేవీపీ: టార్గెట్ 2019 రివర్స్ అవుతోందా?
టిడిపి, బీజేపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయిందన్నారు. తాము ఏపీ ప్రయోజనాల కోసం కచ్చితంగా పని చేస్తామన్నారు. అన్ని పార్టీలు కూడా ముందుకు రావాలన్నారు. టిడిపి కచ్చితంగా అనుకూలంగా వేయాల్సిందేనని, బీజేపీ మిత్రపక్షం కాబట్టి చంద్రబాబు పరిస్థితి దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు.
హోదా అంశం చట్టంలో లేదని బిజెపి, టిడిపిలు చెప్పడం అవగాహనా రాహిత్యం అన్నారు. గతంలో హోదా ఇచ్చిన సందర్భాలలో ఏ చట్టాలు చేయలేదన్నారు. కేబినెట్ భేటీలో చర్చించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే సరిపోతుందన్నారు. లోకసభలో బీజేపీకి మెజార్టీ ఉందని, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని చెప్పారు. అలాంటప్పుడు ఏపీకి హోదా ఇవ్వడంలో కష్టమేమిటో చెప్పాలన్నారు. దాగుడుమూతలు తగవన్నారు.
అదే సంప్రదాయం కొనసాగాలి: కేవీపీ
ప్రయివేటు బిల్లు కోసం మిగతా వాటిని పక్కన పెట్టడం సంప్రదాయమని, అదే కొనసాగుతుందని తాను ఆశిస్తున్నానని కేవీపీ రామచంద్ర రావు అన్నారు. సభా సంప్రదాయం ప్రకారం డిస్టర్బ్ చేయరని భావిస్తున్నానని పేర్కొన్నారు.