హోదా ద్రోహులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి: చలసాని;బాబుది రెండు నాల్కల ధోరణి:సిపిఐ
విజయవాడ : ఐదు కోట్ల మంది ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదా కోసం పోరాడటం మొదలు పెట్టని ద్రోహులు ఎవరైనా ఉంటే ఇకనైనా కళ్లు తెరవాలని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్ సంపూర్ణంగా విజయవంతమైందని ఆయన చెప్పారు.
విజయవాడలో బంద్ లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడారు. ఇకనైన హోదా ద్రోహులు ప్రత్యేక హోదా సాధనకు సహకరించాలంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకై తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేసిన చలసాని అందులో భాగంగానే ఈ నెల 24న బ్లాక్డే నిర్వహించనున్నట్లు తెలిపారు.
బ్లాక్ డే...పాటిద్దామిలా
ప్రత్యేక హోదా కోసం పోరాటంలో భాగంగా ఈ నెల 24 న బ్లాక్ డే పాటించాలంటూ పిలుపు ఇచ్చిన ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఆ రోజు విద్యుత్ దీపాలు నిలిపి వేయడం ద్వారా నిరసన తెలపాలని ప్రజలను కోరారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకూ విద్యుత్ దీపాలు ఆపేసి చీకటి దినంగా పాటించాలని చలసాని ప్రజలను కోరారు. ప్రత్యేక హోదా కోసం తదనంతర పోరాటంపై కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని, అలాగే 24 గంటలపాటు జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని చలసాని ఈ సందర్భంగా తెలియచేశారు.
మోదీ...నిలువునా ముంచారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రజలను ప్రధాని నరేంద్రమోదీ నిలువునా ముంచారని సీపీఎం నేత బాబురావు ధ్వజమెత్తారు. హోదా ద్రోహులకు ఏపీ ప్రజలు సమాధి కడతారని, విభజన సమయంలో కాంగ్రెస్కు పట్టిన గతే రాష్ట్ర బీజేపీకి కూడా పడుతుందన్నారు. హోదా కోసం పిలుపునిచ్చిన బంద్కు అన్ని రాజకీయ పక్షాలు సహకరించాయని, కానీ అధికార టీడీపీ మాత్రం పాల్గొనలేదని బాబురావు తెలియచేశారు. దీన్ని బట్టే చంద్రబాబుకు ప్రత్యేకహోదాపై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆందోళనలు, ఉద్యమాలు చంద్రబాబు చెప్పినట్లే చేయాలంటున్నారని మండిపడ్డారు. హోదా ఉద్యమంలో పాల్గొన్నవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని, బెదిరించి ఉద్యమంలో పాల్గొనకుండా కుట్రలు చేస్తున్నారని బాబురావు తీవ్ర ఆరోపణలు చేశారు.
చంద్ర బాబుది...రెండు నాల్కల ధోరణి
ప్రత్యేక హోదా విషయంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది రెండు నాల్కల ధోరణి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. జపాన్ తరహా ఉద్యమాలు చేయాలని చంద్రబాబు చెబుతున్నారని, అవి ఎలా చేయాలో తమకు తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేయాలన్నచంద్రబాబు, ఇప్పుడు విజయవాడలో ఎందుకు దీక్ష చేస్తున్నారంటూ రామకృష్ణ నిలదీశారు. చంద్రబాబుకు ఏమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా ఢిల్లీలోని జంతర్మంతర్ దగ్గర గానీ, లేదా ప్రధాని మోడీ నివాసం ముందు కానీ దీక్ష చేయాలని సూచించారు.
ముందు సన్మానాలు...తర్వాత మాట మార్పు
మొదట్లో 15 ఏళ్లు ప్రత్యేకహోదా కావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తరువాత మాటమార్చి ప్యాకేజీకి అంగీకరించి సన్మానాలు చేశారని, అలాంటి కపట వ్యక్తి చంద్రబాబు అంటూ రామకృష్ణ మండిపడ్డారు. ఏప్రిల్ 20న ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రాజమండ్రిలో భారీ ర్యాలీ, సభ నిర్వహించనున్నట్లు సిపిై రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.